MLC Nomination : నామినేషన్ దాఖలు చేసిన కూటమి అభ్యర్థులు

MLC Nomination : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ముగ్గురు అభ్యర్థులు, బీజేపీ నుంచి ఒక అభ్యర్థి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ తరఫున కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్ర, బీజేపీ తరఫున సోము వీర్రాజు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్సేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా, కూటమి పార్టీలు సీట్లు సర్దుబాటు చేసుకున్నాయి. టీడీపీ మూడు స్థానాలు, జనసేన, బీజేపీకి ఒక్కో స్థానం కేటాయించారు. ఇప్పటికే జనసే అభ్యర్థి నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు.
అభ్యర్థుల ఎంపికలో కొత్త పంథా..
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ ఎంపికలో కొత్త పంధాను అనుసరించారు. సామాజిక సమీకరణలతో పాటు పార్టీ విధేయులకు అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి యువ మహిళ కావలి గ్రీష్మకు అవకాశం దక్కింది. బీద రవిచంద్ర పార్టీకి అంటిపెట్టుకొని ఉండి టికెట్ విషయంలో కొంత ఇబ్బందులు ఎదురైనా సర్దుకుని పోయారు. దీంతో ఎమ్మెల్సీ టికెట్ కోసం ఆశించారు. అనుకున్నట్లుగా చంద్రబాబు న్యాయం చేశారు. బీటీ నాయుడు కూడా రెన్యువల్ కావాలని అడిగారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. చంద్రబాబు అరెస్టయిన సమయంలో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలకు ధైర్యం ఇచ్చారు. అందుకే చంద్రబాబు తిరిగి రెన్యువల్ చేసినట్టు సమాచారం.
మోదీకి ధన్యావాదాలు : సోము వీర్రాజు
కూటమి పొత్తులో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ అధినాయకత్వం సోము వీర్రాజును ప్రకటించింది. ఈ సందర్భంగా అధిష్ఠానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అవకాశం కల్పించిన ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.