Amaravati : ఏపీలో అంతర్జాతీయ స్థాయి వర్సిటీ.. జీఎన్యూతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

Amaravati : ఏపీలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. ఇవాళ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ (జీఎన్యూ)తో కూటమి ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలో జీఎన్యూ, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం అమరావతిలో అంతర్జాతీయ యూనివర్సిటీ స్థాపించడానికి జీఎన్యూ రూ.1,300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఒప్పందంతో 500 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడారు. జీఎన్యూతో ఒప్పందం రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్య అందనుందని తెలిపారు. రాష్ట్ర విద్యారంగాన్ని ప్రపంచ చిత్ర పటంలో నిలిపేందుకు దోహదపడుతుందన్నారు. ఏపీలో విద్యా ప్రమాణాలను పెంచడమే కాకుండా ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు అందుతాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఒప్పందం నిదర్శనమన్నారు.
ఏపీలో ఉన్నత విద్య ప్రమాణాలను మెరుగుపర్చడం, గ్లోబల్ ఎక్స్పోజర్, పాఠ్యాంశాలను మెరుగుపర్చడం, అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, పరిశోధన, నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఒప్పందం ప్రధాన లక్ష్యమన్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన టెక్నాలజీ, బిజినెస్, హెల్త్ కేర్ రంగాల్లో విద్యార్థులకు జీఎన్యూ నైపుణ్యాలను అందిస్తుందన్నారు.