Kumki Elephants : ఏపీకి కుంకీ ఏనుగులను అప్పగించిన కర్ణాటక ప్రభుత్వం.. కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్

Karnataka government gives six tame elephants to AP : ఆంధ్రప్రదేశ్కు ఆరు కుంకీ ఏనుగులను కర్ణాటక సర్కారు అప్పగించింది. బుధవారం బెంగళూరులోని విధాన సౌధలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో కార్యక్రమం జరిగింది. కుంకీ ఏనుగుల అప్పగింత, సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంట్లను పవన్కు సీఎం సిద్ధరామయ్య అందజేశారు.
సీఎం సిద్ధరామయ్యకు కృతజ్ఞతలు : పవన్ కల్యాణ్
ఆరు కుంకీ ఏనుగులు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి సాయం అడిగినా కర్ణాటక సర్కారు ముందుకొస్తోందని కొనియాడారు. ఏపీ, కర్ణాటక మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. కుంకీ ఏనుగుల సంరక్షణకు ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఏపీ, కర్ణాటక మధ్య 9 ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. పంటపొలాలను నాశనం చేస్తున్న అడవి ఏనుగులను నియంత్రించేందుకు కుంకీ ఏనుగులను రంగంలోకి దించుతామని పేర్కొన్నారు.
కుంకీ ఏనుగులు ఏం చేస్తాయ్?
కుంకీలు ఏనుగులు పూర్తిస్థాయిలో శిక్షణ పొందాయి. ఎక్కడైనా ఏనుగుల గుంపు దాడికి దిగితే కుంకీలను రంగంలోకి దింపుతారు. ఏనుగులను తరిమికొట్టడంలో కీలక భూమిక పోషిస్తాయి. కొన్నిసార్లు గాయపడిన లేదా చిక్కుకున్న అడవి ఏనుగును రక్షించడానికీ ఉపయోగిస్తారు. సాధారణంగా కుంకీ ఏనుగులుగా మగవాటిని ఎంపిక చేసుకుంటారు. ఇవి మాత్రమే ఒంటరిగా సంచరిస్తుంటాయి. కొన్ని నెలల పాటు శిక్షణ ఇస్తారు. తర్వాత ఆపరేషన్ల కోసం వాడుతుంటారు. ఏనుగుల గుంపును అడవిలోకి తిరిగి పంపించేంత వరకు విశ్రమించవు. కొన్నిసార్లు పంట పొలాలపైకి వచ్చిన ఏనుగులతో తలపడాల్సి ఉంటుంది. అందుకే పోరాడడంలో వీటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.