Nambala Kesava Rao : ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత మృతి.. ఎక్స్లో వెల్లడించిన అమిత్ షా

Maoist leader Nambala Kesava Rao : ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు దుర్మరణం చెందారు. విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా ఎక్స్లో వెల్లడించారు. బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోలు మృతిచెందారు. మృతిచెందన వారిలో నంబాల కేశవరావు ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. కేశవరావుపై రూ.1.5కోట్లు రివార్డు ఉందని తెలిపారు.
గణపతి తర్వాత పార్టీ పగ్గాలు..
ఎన్కౌంటర్లో మృతిచెందిన నంబాల కేశవరావు మరో పేరు బసవరాజు. మావోయిస్టుల సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్గా ఉన్నారు. 2018 నవంబర్లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా చేశాడు. తర్వాత అతను పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యాడు. కేశవరావుది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామం. తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు. కేశవరావుకు సోదరుడు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు.
స్వగ్రామంలో ప్రాథమిక విద్య..
కేశవరావు ప్రాథమిక విద్య స్వగ్రామంలో సాగింది. తాతగారి ఊరు టెక్కలి మండలం తలగాంలో హైస్కూల్ విద్య, టెక్కలి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన ఆయన ద్వితీయ సంవత్సరం డిగ్రీ చదువుతుండగా, వరంగల్లోని రీజినల్ ఇంజినీరింగ్ కళాశాలలో సీటు రావడంతో అక్కడికి వెళ్లి అడ్మిషన్ అయ్యారు. తర్వాత ఉద్యమ బాట పట్టారని గ్రామస్తులు చెబుతారు. ప్రజా సేవ అంటే మొదటి నుంచి మక్కువని, తాము ఎన్ని విధాలుగా నచ్చజెప్పినా తిరిగి ఉద్యమాల్లోకి వెళ్లాడని స్థానికులు పేర్కొన్నారు.