TDP Members Murdered: పల్నాడు జిల్లాలో దారుణం.. ఇద్దరు టీడీపీ వర్గీయుల హత్య!

TDP Members Murdered in Palnadu District: పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో శనివారం దారుణం చోటుచేసుకుంది. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ వర్గీయులు దారుణ హత్యకు గురయ్యారు. బైక్పై వెళ్తున్న ఇద్దరిని కారుతో ప్రత్యర్థులు ఢీకొట్టారు. కిందపడిన వారిని గొడ్డళ్లతో ప్రత్యర్థులు నరికి చంపారు. మృతులు గుండ్లపాడుకు చెందిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులుగా గుర్తించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. రాజకీయ కక్షలే హత్యలకు దారితీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో తోట చంద్రయ్యను వైసీపీ నేతలు నరికి చంపిన విషయం తెలిసిందే. తాజాగా అదే గుండ్లపాడుకు చెందిన ఇద్దరు టీడీపీ వర్గీయులు హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విషయం తెలియడంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్ చేశారు. విషయం జిల్లా నేతలు టీడీపీ హై కమాండ్కు తెలిపారు. హత్యకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మాచర్ల నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి ఘటనలు జరుగకుండా ముందస్తుగా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. హత్యకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఘటన స్థలం దగ్గరలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇలాంటి మళ్లీ పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.