TDP Mahanadu 2025: వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలో పదికి పది గెలివాలి: మహానాడులో సీఎం చంద్రబాబు

AP CM Chandrababu on TDP Mahanadu 2025: వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో పదికి పది గెలవాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దేవుని కడపలో జరుగుతున్న మహానాడు చరిత్ర సృష్టించబోతోందని అన్నారు. కడపలో మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. మహానాడు దశ దిశ నిర్దేశిస్తుందని తెలిపారు.
కడప గడ్డపై తొలిసారి మహానాడు ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. మహానాడు చరిత్ర సృష్టిస్తుందన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో పదింటికి ఏడు స్థానాలు గెలిచామన్నారు. వచ్చే ఎన్నికల్లో కష్టపడి పదికి పది స్థానాలు గెలవాలన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం అన్నారు. 93 శాతం స్ట్రైక్రేట్ సాధించి అద్భుత విజయం సాధించామని కొనియాడారు. పార్టీ ఇంతటి విజయాన్ని సాధించిందంటే పసుపు సైనికులే కారణం అన్నారు. జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. ఏమీ ఆశించకుండా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల వల్ల విజయం సాధ్యమైందని సీఎం తెలిపారు.
పీక కోస్తున్నా జై తెలుగుదేశం అన్నాడు..
పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్లకు.. వాళ్ల పనే అయిపోయిందని అన్నారని తెలిపారు. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలను ఎదుర్కొన్నామని తెలిపారు. పాలనంటే హత్యా రాజకీయాలు, కక్షసాధింపులుగా గత వైసీపీ ప్రభుత్వం మార్చేసిందన్నారు. వైసీపీ విధ్వంస పానలతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందన్నారు. దీన్ని ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలు, నాయకుల ప్రాణాలు తీశారని గుర్తుచేశారు. వేటాడారు, వెంటాడారు అన్నారు. అక్రమ కేసులు పెట్టారన్నారు. కానీ, ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. మన పసుపు సింహం, కార్యకర్త చంద్రయ్యను పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలారని అన్నారు. ఆయనే మనకు స్ఫూర్తి అన్నారు. స్ఫూర్తే పార్టీని నడిపిస్తుందని సీఎం అన్నారు.
రాజకీయాల్లో విలువలు తెచ్చిన ఏకైక పార్టీ..
ప్రతిపక్షంలో ఉండగా అవినీతి వ్యతిరేక పోరాటం చేశామని సీఎం అన్నారు. అధికారంలో ఉంటే అవినీతి రహిత పాలన అందించామన్నారు. ప్రజల ఆస్తులు, హక్కులను రక్షణ కల్పించామని తెలిపారు. పాజిటివ్ పాలిటిక్స్తో రాజకీయాల్లో విలువలు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగు దేశం అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీలో చూసినా.. టీడీపీ వర్సిటీలో చదివిన విద్యార్థులేనని చెప్పారు. మన పార్టీ చరిత్ర చింపేస్తే చిరిగేది కాదన్నారు. చెరిపేస్తే చెరిగేది కాదన్నారు. పార్టీ విధానాలు, ఆలోచనలు దేశంలోనే ప్రత్యేకంగా నిలిచాయని సీఎం చంద్రబాబు అన్నారు.