AP Government : ఏపీ సర్కారు గుడ్న్యూస్.. రేపే తల్లికి వందనం నిధులు విడుదల

Talli Ki Vandanam scheme : తల్లులకు ఏపీ సర్కారు గుడ్న్యూస్ చెప్పింది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరో పథకం అమలుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తల్లికి వందనం పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా గురువారం తల్లులకు కానుకగా తల్లికి వందనం పథకం కింద నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. రేపే నిధులు విడుదల కానున్నాయి. ఏపీలో మొత్తం 67 లక్షల మందికి తల్లికి వందనం కింద వారి ఖాతాల్లో సర్కారు నగదు జమ చేయనుంది.
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది. పథకం కింద ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున చెల్లించనుంది. మొత్తం 67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తించనుంది. పథకం కింద రేపు తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో తల్లికి వందనం నిధులు ఇస్తామని సర్కారు హామీనిచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు అర్ధరాత్రి నుంచి నిధులు విడుదల కానున్నాయి. ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు పథకం అమలు కానుంది.
అడ్మిషన్లు పూర్తయి డేటా అందుబాటులోకి రాగానే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమకానున్నాయి. విధి విధానాలను ఖరారు చేస్తూ ఈ రోజు అర్ధరాత్రికి కూటమి ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలను కూటమి సర్కారు అమలు చేసింది. తల్లికి వందనం నిధుల విడుదల చేయాలన్న నిర్ణయంతో ఇచ్చిన మాటను నిలుపుకుంది.
మహిళా మణులకు కానుకగా : మంత్రి నారా లోకేశ్
విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా తల్లికి వందనం అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. సూపర్ సిక్స్లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంతోషమన్నారు.