Chandrababu @NITI Aayog: ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్బుక్ విధానం.. నీతి ఆయోగ్ భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు

AP CM Chandrababu Naidu at NITI Aayog Meeting: నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై నివేదిక ఇచ్చారు. జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించారు. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ను ప్రశంసిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే అంశాలను తన ప్రజంటేషన్లో సీఎం ప్రస్తావించారు.
సీఎం చంద్రబాబు ప్రజంటేషన్లో వివిధ అంశాలు వికసిత్ భారత్కు ఉపయోగపడేలా ఉన్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలను పరిశీలించాలని సూచించారు. సీఎం చంద్రబాబు ప్రజంటేషన్కు సమావేశంలో పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తన ప్రజంటేషన్లో చంద్రబాబు వివరించారు. 2.4 ట్రిలియన్ డాలర్ల ప్రగతి లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సీఎం వెల్లడించారు. వికసిత్ భారత్ కల సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీలో ఉన్న వనరులను తాము ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నామనే విషయాన్ని కూడా సీఎం తన ప్రజంటేషన్లో వివరించారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖపట్నంను తీర్చిదిద్దనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. విశాఖకు గ్లోబల్ హంగులు అద్దేలా 4 జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. విశాఖ మోడల్ను అమరావతి, తిరుపతి, కర్నూలుకు విస్తరించేలా కేంద్రం సహకరించాలని కోరారు. డిజిటల్ గవర్నెన్స్లో భాగంగా గూగుల్ ఏఐ వంటి టెక్నాలజీలను వినియోగిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్బుక్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు సీఎం స్పష్టం చేశారు.