AP CM Chandrababu : ట్రంప్తో చర్చలు జరపండి : కేంద్రమంత్రి గోయల్కు సీఎం చంద్రబాబు లేఖ

AP CM Chandrababu : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. అగ్రరాజ్యం అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వా రంగానికి అండగా నిలువాలని విజ్ఞప్తి చేశారు. సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులు మినహాయింపు పొందేలా ప్రయత్నాలు చేసి రైతన్నలను ఆదుకోవాలని కోరారు. ఏపీ రాష్ట్ర జీడీపీలో మత్స్య రంగం కీలకమైన భూమిక పోషిస్తోందని, ఆక్వా రైతులకు సంక్షోభ సమయంలో అండగా నిలువాలని సీఎం లేఖలో పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు లేఖలో ప్రస్తావించిన అంశాలు..
దేశం నుంచి వెళ్లే సముద్రపు ఆహార ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం 27 శాతం దిగుమతి సుంకం విధిస్తోందని లేఖలో పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇండియా నుంచి అమెరికాకు 2.55 బిలియన్ డాలర్ల విలువైన సముద్రపు ఆహార ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని వెల్లడించారు. వీటిలో రొయ్యలే 92 శాతం వాటా కలిగి ఉన్నాయని వివరించారు. అమెరికా దేశానికి రొయ్యల ఎగుమతిలో కీలకమైన ఇండియాపై 27 శాతం దిగుమతి సుంకం విధించడంతో ఆక్వా రైతాంగం నష్టపోతోందని తెలిపారు. ఈక్వెడార్ వంటి ఎగుమతిదారులపై కేవలం 10 శాతం పన్ను మాత్రమే అమెరికా విధిస్తోందని లేఖలో వివరించారు. ఇది మన దేశానికి పరోక్షంగా నష్టం చేస్తూ వారికి అనుకూలంగా మారుతోందని పేర్కొన్నారు. దీనికి తోడు మన దేశ ఎగుమతిదారులు ఇప్పటికే 5.77 శాతం కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ (సీవీడీ) భారాన్ని మోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సుంకాలను కలుపుకుంటే ఈక్వెడార్కు దేశానికి మధ్య సుంకాల వ్యత్యాసం దాదాపు 20 శాతం ఉంటోందని వివరించారు.
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన నూతన సుంకం ఏప్రిల్ 5, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. దీని కారణంగా అమెరికాకు వెళ్లే అన్ని ఎగుమతులపై భారం పడుతోందని తన లేఖలో పేర్కొన్నారు. గతంలో వచ్చిన ఆర్డర్లకు సంబంధించిన ఉత్పత్తులు ప్యాకింగ్ చేయబడి కోల్డ్ స్టోరేజ్లు, పోర్టుల్లో ఉన్నాయని, నూతన నిబంధనలతో ఉత్పత్తులపై సుంకాల భారం పడుతోందన్నారు. యూరోపియన్ యూనియన్లో భారతీయ ఎగుమతిదారులు 50శాతం తనిఖీ రేట్లు, 4 నుంచి 7 శాతం వరకు దిగుమతి సుంకంతోపాటు నాన్-టారిఫ్ అడ్డంకులను ఎదుర్కొంటున్నారని, కానీ వియత్నాం వంటి దేశాలు ఈయూతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA)కింద జీరో డ్యూటీ పొందుతున్నాయని తెలిపారు. దీని కారణంగా వియత్నాం వంటి దేశాలు యూరోపియన్ మార్కెట్ను సమర్థవంతంగా ఆక్రమిస్తున్నాయని తెలిపారు. వియత్నాం, థాయిలాండ్, జపాన్ దేశాలు ఇండియా నుంచి సీఫుడ్ కొనుగోలు చేసి వాటిని ప్రాసెస్ చేసి అమెరికాకు ఎగుమతి చేస్తాయని తెలిపారు.
నేడు తుది ఉత్పత్తులపై విధించిన అధిక ట్యాక్స్ల కారణంగా ఆ దేశాలు మనకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేస్తున్నాయని లేఖలో వివరించారు. ఏపీలో శీతల గిడ్డంగులు నిండిపోవడంతో చేతికి వచ్చిన ఆక్వా పంట ఎక్కడ ఉంచాలో తెలియని గందరగోళ పరిస్థితిలో రైతాంగం ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఇంకా పంట సిద్ధంగా ఉందని, 27 శాతం సుంకాలతో రైతుల నుంచి పంట సేకరించడం ఎగుమతిదారులు నిలిపివేశారని వివరించారు. ఈ పరిణామాలతో రాష్ట్ర ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులు, హేచరీలు, ఫీడ్ మిల్లులు, ప్రాసెసర్లు, ఎగుమతిదారులు ఇలా అందరికీ సమస్యలు ఎదురయ్యాయని తల లేఖలో వివరించారు. సుంకాల నుంచి రొయ్యలను మినహాయింపు జాబితాలో చేర్చేలా అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. సకాలంలో దీనిపై జోక్యం చేసుకుని సమస్య పరిష్కరిస్తే ఆక్వాపై ఆధారపడిన లక్షలాది మంది జీవనోపాధిని కాపాడాలంటూ లేఖ రాశారు.