Published On:

China-USA : వెనక్కి తగ్గబోమంటున్న చైనా.. అమెరికాపై సుంకాలు 125 శాతానికి పెంపు

China-USA : వెనక్కి తగ్గబోమంటున్న చైనా.. అమెరికాపై సుంకాలు 125 శాతానికి పెంపు

China-USA : అగ్రరాజ్యం అమెరికా, చైనా ఇరుదేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులను డ్రాగన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను అమెరికా 145 శాతానికి పెంచగా, డ్రాగన్ నుంచి కూడా అదే రియాక్షన్ వచ్చింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాలను చైనా 125 శాతానికి పెంచింది.

 

చైనాపై విధించిన సుంకాలు 145శాతం..
చైనాపై విధించిన సుంకాలను లెక్కిస్తే 145శాతంగా ఉంటాయని అమెరికా శ్వేతసౌధం కార్యనిర్వాహక ఉత్తర్వు వెల్లడించింది. ఈ క్రమంలో తాము విధించిన 84 శాతం సుంకాలను 125 శాతానికి పెంచుతూ చైనా ప్రకటించింది. విధించిన సుంకాలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీన్ని ఒక నంబర్‌ గేమ్‌గా మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. ఆర్థికంగా ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారం అంతా ఆచరణాత్మక ప్రాముఖ్యత లేనిదని, దీర్ఘకాలంలో రెండుదేశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చెప్పింది. చైనా వస్తువులపై విధించిన సుంకాలను తొలగించేలా యూఎస్ నిర్ణయం తీసుకోవాలని కోరింది.

 

టారిఫ్‌లను పట్టించుకోం..
అమెరికా వేసే టారిఫ్‌లను తాము పట్టించుకోబోమని స్పష్టం చేసింది. వాషింగ్టన్ సుంకాలపై బీజింగ్‌ ప్రపంచ వాణిజ్య సంస్థలో దావా వేయనున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. అమెరికా విధించిన సుంకాలపై చైనా ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసే కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయని సోషల్‌ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

 

తుదివరకూ పోరాడతాం..
సుంకాలపై అమెరికాతో తలపడుతున్న చైనా కాస్త వెనక్కి తగ్గింది. బెదిరింపులకు తలొగ్గబోమని, తాము చర్చలకు సిద్ధమని ప్రకటించింది. అమెరికా సుంకాల యుద్ధమే చేస్తే తుదివరకూ తాము పోరాడతామని చైనా వాణిజ్యశాఖ అధికార ప్రతినిధి యాంగ్‌కియాన్‌ పేర్కొన్నారు. చైనాతో డీల్‌ చేయాలంటే ఒత్తిళ్లు, బెదిరింపులు, బ్లాక్‌మెయిళ్లు సరైన మార్గం కాదని, ఇరుదేశాలు కలిసి కూర్చుని విభేదాల పరిష్కారానికి కృషి చేస్తాయని ఆశిస్తున్నామని యాంగ్‌కియాన్‌ తెలిపారు. పరస్పర గౌరవం అనే సిద్ధాంతాల ఆధారంగా చర్చలు జరగాలన్నారు.

 

జిన్‌పింగ్ ఫస్ట్‌ రియాక్షన్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై టారిఫ్‌ల మోత మోగిస్తున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తొలిసారి స్పందించినట్లు డ్రాగన్ ప్రభుత్వ మీడియా సంస్థ జిన్హువా పేర్కొంది. అగ్రరాజ్యం అమెరికా విధించిన 145 శాతం సుంకాలను ఏకపక్ష నిర్ణయంగా అభివర్ణించారు. బెదిరింపులను అడ్డుకోవడానికి ఐరోపా యూనియన్ తమతో కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. చైనా, యూరప్‌ తమ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉందన్నారు. అప్పుడే తమ సొంత చట్టబద్ధ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి వీలు అవుతుందన్నారు. అంతర్జాతీయ పారదర్శకత, న్యాయాన్ని కాపాడొచ్చని చెప్పారు. బీజింగ్‌లో స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్‌తో భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

 

 

 

ఇవి కూడా చదవండి: