Published On:

Who is Masood Azhar: భారత మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ చరిత్ర!

Who is Masood Azhar: భారత మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ చరిత్ర!

Who is Masood Azhar..?: మసూద్ అజర్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. 1968 జులై 10 బహావల్‌పుర్‌లోని అల్లాబక్ష్ కుటుంబంలో మసూద్ అజర్ జన్మించాడు. మసూద్ తండ్రి బహావల్‌పుర్‌లోని ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టర్. భారత హోం మంత్రిత్వ శాఖ 2024 మార్చి 7న విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో మొదటి పేరు 57ఏళ్ల మసూద్ అజర్‌దే. భారత్‌కు వ్యతిరేకంగా జరిగిన చాలా నేరాలకు సంబంధించిన కేసుల్లో అతను నిందితుడు.

 

ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని టెర్రరిస్టు గ్రూపులు జైషే మహ్మద్, లష్కరే తోయిబా స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసింది. క్షిపణి దాడులతో ఉగ్ర వాద శిబిరాల్లో మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. భారత్ పై ఉగ్రదాడుల స్థావరాలపై దాడులు చేస్తూ పాక్‌కు ధీటుగా సమాధానం చెప్పింది.

 

పాకిస్తాన్ పై భారత్ జరిపిన దాడిలో తమ నాయకుడు మసూద్ అజర్ కుటుంబలో పది మంది సభ్యులు, నలుగురు సన్నిహితులు చనిపోయారని జైషే మొహమ్మద్ సంస్థ తెలిపింది. మసూద్ అజర్ అక్క, బావ, మేనల్లుడి భార్య, మేనకోడలు, ఐదుగురు పిల్లలతో సహా మొత్తం పది మంది చనిపోయాని ఆ సంస్థ మే 7న ప్రకటించింది. పాకిస్తాన్ బహావల్‌పుర్‌లోని సుబ్హాన్ మసీదుపై జరిగిన దాడిలో మసూద్ అజర్ బంధువులు చనిపోయారని ఆ ప్రకటనలో తెలిపింది.

 

మసూద్ అజర్ చాలా దాడుల్లో నిందితుడిగా ఉన్నాడు. శ్రీనగర్‌లోని జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సముదాయంపై 2001 అక్టోబరు 1న జరిగిన దాడిలో 38 మంది చనిపోయారు. మసూద్ అజర్‌పై ఉన్న కేసుల్లో ఇది కూడా ఒకటి. ఆ తర్వాత 2001 డిసెంబరు 12న భారత పార్లమెంట్‌పై జరిగిన దాడి కేసులోనూ మసూద్ నిందితుడు. ఈ దాడిలో ఆరుగురు భద్రతాసిబ్బంది, ఇతరులు ముగ్గురు చనిపోయారు.

 

40 మంది భద్రతాసిబ్బంది మరణించిన పుల్వామా దాడిలో కూడా మసూద్ అజర్ నిందితుడు. 1999లో కాందహార్ హైజాక్ సమయంలో భారత్ విడుదల చేసిన ముగ్గురు ఉగ్రవాదుల్లో మసూద్ అజర్ ఒకరు. అప్పటి భారత విదేశాంగమంత్రి జస్వంత్ సింగ్ ప్రత్యేక విమానంలో మసూద్ అజర్‌ను కాందహార్ తీసుకెళ్లారు. అప్పటినుంచి భారత భద్రతాబలగాలు మసూద్ కోసం వెతుకుతున్నాయి. భారత్‌లో నిషేధం విధించిన జైషే మొహమ్మద్‌కు హెడ్ మసూద్ అజర్. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం పాకిస్తానీ పంజాబ్‌లోని బహావల్‌పుర్‌లో ఉందని భారత ప్రభుత్వం ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. పాకిస్తాన్ లోపల 100 కిలోమీటర్ల పరిధిలోకి చొచ్చుకెళ్లి మొదటిసారి భారత్ దాడులు చేయడానికి ఇది కూడా ఓ కారణమని భావిస్తారు. మసూద్ అజర్‌ను తమకు అప్పగించాలని పాకిస్తాన్‌ను భారత్ ఎన్నోసార్లు కోరింది. కానీ ఆయన తమ దేశంలో లేరని పాకిస్తాన్ బుకాయిస్తూ వచ్చింది.

 

ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థల జాబితాలో మౌలానా మసూద్ అజర్‌కు చెందిన జైషే మొహమ్మద్‌ను చేర్చాలని 2009 నుంచి భారత్ డిమాండ్ చేస్తోంది. కానీ చైనా వీటో ఉపయోగించి ఎప్పుడూ అడ్డుకుంటూ వచ్చింది. జైషే మొహమ్మద్‌ను ఉగ్రవాద సంస్థగా ఐక్యరాజ్యసమితి గుర్తించాలని పదేళ్లపాటు భారత్ ప్రయత్నాలు చేసింది. పుల్వామా దాడి తర్వాత 2019 మే 1న జైషే మొహమ్మద్‌ను ఉగ్రవాదసంస్థగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీనిపై భద్రతామండలి ఆంక్షల కమిటీ దగ్గర పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తంచేసింది.మసూద్ అజర్ నాయకత్వంలో ఉగ్రవాద కార్యకలాపాల కోసం జైషే మొహమ్మద్ భారీగా రిక్రూట్‌మెంట్ చేసుకుంటోందని భారత హోంశాఖ తెలిపింది. భారత్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా యువతను రెచ్చగొడుతోందని చెప్పింది. కరాచీలో చదువుకునే రోజుల నుంచి జిహాదీ కార్యకలాపాల్లో మసూద్ అజర్ పాల్గొంటున్నట్లు 2022లో ఓ కథనం వెలువడింది.