All Party Delegations: ఉగ్రవాదంపై పోరు.. భారత్కు మద్దతుగా యూఏఈ, జపాన్

UAE, Japan in support of India: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్, భారత్ మీదకు ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్లేందుకు అఖిలపక్ష బృందాలను కేంద్ర ప్రభుత్వం విదేశాలకు పంపించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), జపాన్కు బృందాలు వెళ్లాయి. పాకిస్థాన్ దుశ్చర్యలు, భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై ఆయా దేశాల నాయకులకు వివరించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్కు పూర్తి మద్దతు లభిస్తున్నట్లు అక్కడ ఉన్న మన రాయబార కార్యాలయాలు వెల్లడిస్తున్నాయి.
శివసేన ఎంపీ శ్రీకాంత్ శిందే నేతృత్వంలో..
శివసేన ఎంపీ శ్రీకాంత్ శిందే నేతృత్వంలోని అఖిలపక్ష బృందం యూఏఈలో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ప్రముఖులు, మేధావులతో భేటీ అవుతోంది. ఇప్పటికే రెండు కీలక సమావేశాల్లో పాల్గొంది. ఈ సందర్భంగా పాకిస్థాన్ నుంచి ఎదురవుతున్న ఉగ్ర ముప్పు, ఆపరేషన్ సిందూర్ వంటి చర్యలను మన బృందం వివరించింది. ఈ క్రమంలో ఇండియా చేపట్టిన దౌత్యపరమైన కార్యక్రమానికి యూఏఈ అధికారులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా రూపుమాపాల్సిందేనని స్పష్టం చేశారు.
జేడీయూ ఎంపీ సంజయ్ ఝా సారథ్యంలో..
జేడీయూ ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలో జపాన్లో అఖిల పక్ష బృందం పర్యటిస్తోంది. అక్కడి నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తోంది. జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఇండియా తీసుకున్న చర్యలను కొనియాడారు. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడే వారిని శిక్షించాలని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో ఇండియాకు అండగా జపాన్ నిలుస్తుందని భరోసానిచ్చారు.