Vijay Kanakamedala Apologies: సోషల్ మీడియాలో ట్రోలింగ్.. మెగా అభిమానులకు డైరెక్టర్ విజయ్ కనకమేడల క్షమాపణలు!

Vijay Kanakamedala Apologies to Mega Fans: డైరెక్టర్ విజయ్ కనకమేడలపై కొన్ని రోజులుగా విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా వైఎస్సార్సీపీ శ్రేణులు నుంచి ఆయనకు తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీనికి భైరవం ట్రైలర్ లాంచ్ ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట, ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మొన్నటి వరకు వైఎస్సార్సీపీ శ్రేణుల నుంచి మాత్రమే ఉన్న ఈ వ్యతిరేక సెగ మెగా అభిమానులు నుంచి కూడా మొదలైంది. మెగా ఫ్యాన్స్ నుంచి వస్తున్న ట్రోలింగ్పై తాజాగా ఆయన స్పందించారు. ఈ మేరకు ట్విటర్లో వివరణ ఇస్తూ ఓ ట్వీట్ చేశారు.
మెగా ఫ్యాన్స్ నమస్కారం..
“అందరికీ గుడ్ ఈవెనింగ్ అండీ.. మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులందరికి నమస్కారం. మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్ జరుగుతుంది. దానికి ముందు నాకు మెగా అభిమానుల నుంచి సపోర్టు వచ్చింది. కానీ ఈ రోజు నాకు తెలియకుండా ఒక ముబ్ఫై నిమిషాల నుంచి అభిమానుల వైపు నుంచి కూడా ట్రోల్ జరుగుతున్నట్టు తెలిసింది. ఎప్పుడో 2011లో ఫేస్బుక్లో నేను ఒక పోస్ట్ పెట్టానని ట్రోల్ చేస్తున్నారు. దానికి వివరణ ఇచ్చుకునేందుకు ఈ పోస్ట్ పెడుతున్నా. అది నేను పెట్టిన పోస్ట్ కాదు.. ఏదో జరిగింది. నా అకౌంట్ హ్యాక్ అయ్యి ఉంటుంది.
మెగా హీరోలతో మంచి సాన్నిహిత్యం
నేను అందరు హీరోలతో పని చేశాను. నేను ఎక్కువ పని చేసింది మెగా హీరోలతోనే. మెగా హీరోలు అందరితోనూ నాకు సానిహిత్యం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమాకు నేను పని చేశాను. అప్పుడు నన్ను కళ్యాణ్ గారు బాగా సపోర్ట్ చేశారు. అదే సమయంలో సాయి ధరమ్ తేజ్ గారిని కూడా పరిచయం చేసి మంచి కథ ఉంటే డైరెక్షన్ చేసుకో అన్నారు. తేజ్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నన్ను అన్న అన్న అని సంబోధిస్తుంటారు. అలాంటిది నేను మెగా అభిమానులను ఎందుకు దూరం చేసుకుంటాను. అందరిలాగే నేను కూడా చిరంజీవి గారి, పవర్ స్టార్ గారి సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చాను.
ఆ గ్యారెంటీ ఇస్తున్నా
అటువంటి నేను ఎందుకు వాళ్లను దూరం చేసుకుంటాను. నా సోషల్ మీడియా పేజీలో పోస్ట్ అయింది.. తెలిసో తెలియకో జరిగింది. అది హ్యాక్ అయింది.. అయినా కూడా నా సోషల్ మీడియా పేజీ కాబట్టి బాధ్యత తీసుకుంటున్నాను. ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను. ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక పక్కన నా సినిమాపై ట్రోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగదు. ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగకుండ నేను గ్యారెంటీ తీసుకుంటాను. మెగా అభిమానులు అందరికీ.. మీలో ఒకడిగా నేను హామీ ఇస్తూ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నా” అంటూ ఆయన రాసుకొచ్చారు.
అయితే తన పోస్ట్లో ఎక్కడ కూడా వైఎస్సార్సీపీ ఫ్యాన్స్, శ్రేణుల గురించి ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం. కాగా భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. ‘ధర్మాన్ని కాపాడటం కోసం ఎప్పుడు ఎవరోకరు వస్తూనే ఉంటారు. సరిగ్గా సంవత్సరం కూడా మన రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఒకరు వచ్చారు.. అలాగే మా సినిమాల్లో ధర్మాన్ని కాపాడ్డానిక మా కాల భైరవులు వచ్చి ధర్మాన్ని కాపాడతారు’ అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్పై వైఎస్సార్సీపీ శ్రేణులు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాయ్కాట్ భైరవం (#boycott Bhairavam) అనే పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.
నమస్కారం
అందరికీ గుడ్ ఈవెనింగ్ అండీ..
మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులకు అందరికీ గుడ్ ఈవెనింగ్. మేము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేసాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్…
— Vijay Kanakamedala (@DirVijayK) May 22, 2025