Ayodhya Ram Mandir: అయోధ్యలో రామదర్బార్ ప్రాణ ప్రతిష్ఠ.. యూపీ సీఎం హాజరు

Ramdarbar Ceremony: అయోధ్య రామాలయంలో ఇవాళ రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ వేడుకను వైభవంగా నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. అయోధ్య రామాలయం మొదటి అంతస్థులో రామదర్బార్ ప్రాణప్రతిష్ఠ అనంతరం.. భక్తులకు రామ్ లల్లా దర్శనాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడారు. ఇవాళ ఉదయం 6 గంటలకు ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయని చెప్పారు. తర్వాత మధ్యాహ్నం 1.25 గంటల నుంచి 1.40 గంటల మధ్య అభిజీత్ ముహూర్తంలో శ్రీ రామదర్బార్ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందన్నారు.
శ్రీరామదర్బార్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా మొదటి అంతస్తులో ఉన్న రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుని విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠతో పాటు మరో ఏడు దేవాలయాలలో విగ్రహాల ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ ప్రాణ ప్రతిష్ఠ ఆచారాన్ని చందౌలి జిల్లాకు చెందిన ప్రసిద్ధ పండిట్ జైప్రకాశ్ నేతృత్వంలో 101 మంది వేద ఆచార్యులు నిర్వహించారు. పవిత్ర సరయు నది నుంచి పవిత్ర కలశ యాత్ర నిర్వహించారు.