Rajasthan Seals Border: పాక్ సరిహద్దు సీల్.. పాఠశాలలు మూసివేత
Rajasthan Seals Border: పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాజస్థాన్లో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 1,037 కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేసింది. అలాగే నేటి నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు జోధ్పూర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు అంగన్ వాడీ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అన్ని సంస్థలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మరోవైపు, మే 9 వరకు జోధ్పూర్, బికనేర్, కిసన్ఘర్ విమానాశ్రయాలను మూసివేశారు.
అంతేకాకుండా, పంజాబ్ బార్డర్లోనూ అప్రమత్తమయ్యారు. ఈ మేరకు పోలీసులకు సెలవులు సైతం రద్దు చేశారు. మొత్తం బార్డర్లో ఉన్న 6 జిల్లాల్లో పాఠశాలలు మూసివేశారు. ఫిరోజ్ పూర్, పఠాన్ కోట్, ఫజ్లికా, అమృత్ సర్, గురుదాస్ పుర్, తార్న్ తరన్ ప్రదేశాల్లో 3 రోజులు పాఠశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో పోలీస్ శాఖతో పాటు ఇతర దళాల్లోనూ సెలవులు రద్దు చేసిన సంగతి తెలిసిందే.
మొత్తం పాకిస్థాన్తో పంజాబ్ 532 కిలోమీటర్లు సరిహద్దు ఉండగా.. కేంద్రం తొలుత ఇక్కడ హై అలర్ట్ జారీ చేసింది. దీంతో పంజాబ్తో పాటు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలతో పాకిస్థాన్ సరిహద్దు పంచుకుంటుంది. ఇందులో భాగంగానే రాజస్థాన్ పరిధిలో 1037 కిలోమీటర్లు ఉన్న పాకిస్థాన్ సరిహద్దును సీల్ చేశారు. ఈ ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కార్యక్రమాలకు పాల్పడితే కాల్చివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.