PBKS Vs LSG: ఆకాశమే హద్దుగా ఆడిన బ్యాటర్లు.. పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్

IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ మధ్య పోరు జరుగుతోంది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన పంజాబ్ ఆకాశమే హద్దుగా సాగింది. జట్టు బ్యాటర్లు రాణించడంతో లక్నో ముందు భారీ టార్గెట్ ఉంచింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ 48 బంతుల్లో 91 మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మోరవైపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (45), శశాంక్ సింగ్ (29) పరుగులు చేశారు. కానీ మిగతా బ్యాటర్లు రాణించలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఇక లక్నో బౌలర్లలో ఆకాష్ మహారాజ్ సింగ్, దిగ్వేశ్ కు చెరో రెండు వికెట్లు దక్కాయి. ప్రిన్స్ యాదవ్ ఒక వికెట్ తీసుకున్నాడు.
ముందుగా బ్యాటింగ్ కు వచ్చిన పంజాబ్ కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ ప్రియాంశ ఆర్య మొదటి ఓవర్లోనే వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన జోష్ ఇంగ్లిస్ తో కలిసి ప్రభ్ సిమ్రాన్ సింగ్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. తర్వాత 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జోష్ ఇంగ్లిష్ ఔటయ్యాడు. పవర్ ప్లే ముగిసేసమయానికి పంజాబ్ 2 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది. అనంతరం సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ కలిసి పరుగుల వరద పారించారు. వీరిద్దరూ కలిసి 78 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. చివరిలో శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ అద్భుతంగా రాణించి స్కోర్ బోర్డును 230 దాటించారు.