Fire Accident: ఎస్బీఐ బ్యాంక్ లో అగ్నిప్రమాదం.. సికింద్రాబాద్ లో ఘటన
Patny: సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ భవనంలోని ఐదో అంతస్తులో మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో బిల్డింగ్ పరిసర ప్రాంత ప్రజలు, వ్యాపారస్థులు ఆందోళన చెందుతున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు తెలుపుతున్నారు.
భవనం మొత్తం మంటలు వ్యాపించడంతో ఆందోళన నెలకొంది. అలాగే బ్యాంక్ లో ఉన్న కీలకమైన ఫైళ్లు కాలిపోయినట్టు తెలుస్తోంది. ఇవాళ ఆదివారం, బ్యాంక్ కు సెలవు కావడంతో ప్రజలు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బిల్డింగ్ లో ఎవరైనా ఉన్నారా అనేది తేలాల్సి ఉంది. అయితే మంటలు పక్క భవనాలకు వ్యాపించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తు జాగ్రత్తగా స్థానికులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు.