Mamata Banerjee : సునీతా విలియమ్స్కు భారత రత్న ఇవ్వాలి : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

Mamata Banerjee : 8 రోజుల మిషన్ కోసం అని వెళ్లి దాదాపు 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ సురక్షితంగా భూమికి చేరుకున్న విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం బుధవారం వేకువజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్రజలాల్లో దిగారు. వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా వ్యోమగాములను అభినందిస్తున్నారు.
తాజాగా సునీత రాకపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. సునీత సురక్షితంగా భూమి మీదకు చేరడంపై హర్షం వ్యక్తం చేశారు. సునీతకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ఆమె మాట్లాడారు. సునీతా విలియమ్స్కు కృతజ్ఞతలు తెలియజేశారు. సునీత చాలా బాధలు భరించారని తెలిపారు. వ్యోమగాములను సురక్షితంగా భూమి మీదకు చేర్చేందుకు కృషి చేసిన రెస్క్యూ బృందానికి ధన్యవాదాలు తెలిపారు.
గతంలో కల్పనా చావ్లా కూడా అంతరిక్ష కేంద్రానికి వెళ్లిందని, కానీ తిరిగి రాలేకపోయిందన్నారు. సునీతా విలియమ్స్ వెళ్లిన అంతరిక్ష నౌకలో కూడా ఏదో లోపం ఉందని తాను విన్నట్లు చెప్పారు. కల్పనా చావ్లా కూడా అదే సమస్యను ఎదుర్కొన్నారని, అందుకే సునీత, మరో ముగ్గురు వ్యోమగాములు చాలా నెలలుగా అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చిందన్నారు. సునీతా విలియమ్స్ భారత్ చెందిన వ్యక్తి అన్నారు. ఆమెకు భారతరత్న ఇవ్వాలని తాను కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నానని దీదీ అన్నారు.