RCB : చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట.. పదిమంది మృతి, పలువురికి గాయాలు
RCB Celebrations : ఐపీఎల్-2025 కప్ను గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స బెంగళూరు టీమ్ విజయోత్సవాలు విషాదాంతమయ్యాయి. అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట జరిగి పదిమంది మృతిచెందారు. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
18 ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ కప్పు గెలిచింది. బుధవారం జట్టు అహ్మదాబాద్ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు చేరుకుంది. నగరంలోని చిన్నస్వామి స్టేడియంలో సంబురాలకు ఏర్పాట్లు చేశారు. సంబురాల్లో పాల్గొనేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొందరు బారీకేడ్లు, పోలీసులను తోసుకుని స్టేడియం వైపు దూసుకెళ్లారు.
దీంతో అభిమానులను అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. ఈ క్రమంలో అభిమానులు గుంపులు గుంపులుగా స్టేడియంలోకి పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో పదిమంది మృతిచెందారు. మరో 50 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మృతుల సంఖ్య గురించి ఇప్పుడే చెప్పలేం : డీకే శివకుమార్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల్లో విషాద ఘటనపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. నగర సీపీతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఘటనలో ఎంత మంది చనిపోయారో ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేశారు. ప్రజలంతా సంయమనంతో ఉండాలన్నారు. ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమాన్ని పది నిమిషాల్లోనే ముగించామని తెలిపారు. లక్షలాది మంది అభిమానులు వచ్చారని తెలిపారు. పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేంకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.