Published On:

Case filed on Satya Pal Malik: జమ్మూకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌పై.. సీబీఐ ఛార్జిషీటు దాఖలు

Case filed on Satya Pal Malik: జమ్మూకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌పై.. సీబీఐ ఛార్జిషీటు దాఖలు

CBI charges former Jammu and Kashmir Governor: జమ్మూకశ్మీర్‌లో ఓ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌పై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. కేసుకు సంబంధించి గతంలో ఆయన ఇండ్లల్లో సీబీఐ సోదాలు జరిపింది. తాజాగా ఆయనతోపాటు మరో ఐదుగురి పేర్లను ఛార్జిషీటులో పేర్కొంది.

 

రూ.2,200 వేల కోట్ల అవినీతి..

కిష్త్వార్‌లో రూ.2,200 వేల కోట్ల విలువైన కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో అవినీతి జరిగిందని ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో 2022సంవత్సరంలో మాలిక్‌తోపాటు మరో ఐదుగురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో మాలిక్‌, అతని సహాయకులకు సంబంధించి 30 ప్రాంతాల్లో గతేడాది ఫిబ్రవరిలో సోదాలు చేసింది. అనంతరం 5 గంటలపాటు విచారించింది. కేసులో చినాబ్‌ వ్యాలీ పవర్‌ ప్రాజెక్టు మాజీ చైర్మన్‌ నవీన్‌ కుమార్‌ చౌధరి సహా అనేకమంది అధికారులు ఉన్నారు.

 

2019 వరకు జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా..

2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్‌ 30 వరకు జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా సత్యపాల్‌ మాలిక్‌ పనిచేశారు. ఆ సమయంలో తన వద్దకు రెండు దస్త్రాలు వచ్చాయని, దస్త్రాలపై సంతకం చేస్తే రూ.300 కోట్లు ముట్టచెబుతామంటూ కొందరు తన కార్యదర్శులను సంప్రదించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో ఓ దస్త్రం హైడ్రో పవర్‌ ప్రాజెక్టుదని తెలిపారు. ఈ క్రమంలోనే సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

 

ఖండించిన సత్యపాల్ మాలిక్..

కేసులో తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను సత్యపాల్‌ అప్పట్లో ఖండించారు. అవినీతిపై తాను ఫిర్యాదు చేసిన వారిపై కాకుండా తన ఇండ్లపై సోదాలు జరపడాన్ని ప్రశ్నించారు. తాను రైతు కుమారుడనని, ఎవ్వరికీ తలవంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాజాగా కేసులో ఛార్జిషీటు దాఖలు చేయడంపై ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ప్రస్తుతం తాను ఆసుపత్రిలో ఉన్నానని, ఎవరితో మాట్లాడే పరిస్థితిలో లేనని చెప్పారు. అనేకమంది నుంచి ఫోన్లు వస్తున్నాయని, వారితో మాట్లాడలేకపోతున్నాని మాలిక్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: