Indians Missing in Iran: ఇరాన్లో ముగ్గురు భారతీయులు మిస్సింగ్.. రూ.కోటి డిమాండ్ చేసిన కిడ్నాపర్లు

3 Indians missing in Iran: ఇరాన్లో ముగ్గురు భారతీయులు మిస్సింగ్ అయ్యారు. విషయాన్ని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. అదృశ్యమైన ముగ్గురి కోసం గాలింపు చేపడుతున్నట్లు పేర్కొంది.
తప్పిపోయిన వారు పంజాబ్లోని సంగ్రూర్కు చెందిన హుషన్ప్రీత్సింగ్, ఎస్బీఎస్ నగర్కు చెందిన జస్పాల్సింగ్, హోషియాపూర్కు చెందిన అమృత్పాల్ సింగ్గా గుర్తించారు. ఈ నెల 1వ తేదీన టెహ్రాన్లో ల్యాండ్ అయిన కొద్దిసేపటికే అదృశ్యమైనట్లు ఎంబసీ తెలిపింది. ముగ్గురు యువకుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని, ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నట్లు పేర్కొంది.
మరోవైపు పంజాబ్లోని ఓ ఏజెంట్ ముగ్గురు యువకులను దుబాయ్-ఇరాన్ మార్గం ద్వారా ఆస్ట్రేలియాకు పంపుతానని హామీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇరాన్లో బస కల్పిస్తామని హామీ ఇచ్చారని, అక్కడ దిగగానే కిడ్నాప్ చేసినట్లు ఆరోపించారు. కిడ్నాపర్లు రూ.కోటి డిమాండ్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యువకులను తాళ్లతో కట్టేసి చేతుల నుంచి రక్తం కారుతున్న వీడియోను పంపినట్లు తెలిపారు. డబ్బులు పంపకపోతే చంపేస్తామని కిడ్నాపర్లు బెదిరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు ముగ్గురిని విదేశాలకు పంపిన ఏజెంట్ హోషియాపూర్లో కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.