Maoists: లొంగిపోయిన 17 మంది మావోలు.. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్

Bhadradri: దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ ముమ్మరంగా కొనసాగుతోంది. అందులో భాగంగా తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దులో భద్రతా బలగాలు అణువణువు జల్లెడ పడుతున్నాయి. కాగా ఈ మధ్య కాలంలో కర్రెగుట్టలు, నారాయణపూర్ మాధ్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు, మావోయిస్టు నేతలు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన మావోయిస్టుల్లో పలువురిపై భారీగా రివార్డులు కూడా ఉన్నాయి.
ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ ఆర్థిక సాయం చేస్తామని, జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా కొత్తగూడెంలో 17 మంది మావోయిస్టులు ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోయారు. అందులో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. లొంగిపోయిన వారంతా బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన మావోయిస్టులుగా పోలీసులు గుర్తించారు. అనంతరం జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు వసతులు కల్పిస్తామని ఎస్పీ రోహిత్ రాజు హామీ ఇచ్చారు.