Published On:

Drones on Moscow Airport: మాస్కోలో డ్రోన్ దాడులు.. భారత ఎంపీలకు తప్పిన ప్రమాదం!

Drones on Moscow Airport: మాస్కోలో డ్రోన్ దాడులు.. భారత ఎంపీలకు తప్పిన ప్రమాదం!

Ukraine Drones on Moscow Airport: రష్యాలో భారత ఎంపీల బృందానికి పెను ప్రమాదం తప్పింది. పాక్ ఉగ్రదాడులు, అనంతరం జరిగిన దాడులపై ప్రపంచ దేశాలకు వివరించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. కాగా ప్రస్తుతం ఈ బృందాలు ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యాకు వెళ్లిన భారత బృందానికి భయానక అనుభవం ఎదురైంది. డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని దౌత్య బృందం రష్యా రాజధాని మాస్కోకు వెళ్లింది. అయితే వీరు ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యే సమయానికి మాస్కోలో డ్రోన్ దాడి జరిగింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడి కారణంగా మాస్కోలో దేశీయ, అంతర్జాతీయ విమాన రాకపోకలను కొన్ని గంటలు నిలిపివేశారు. మాస్కో ఎయిర్ పోర్టును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. దీంతో భారత దౌత్య బృందం విమానం ల్యాండింగ్ కు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో విమానం చాలా సమయం గాల్లోనే చాలాసేపు చక్కర్లు కొట్టింది.

 

కాగా కనిమొళి నేతృత్వంలోని భారత దౌత్య బృందం విమానం చాలాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టి చివరికి మాస్కో ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం రష్యాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు విమానాశ్రయంలో అఖిలపక్ష ఎంపీల బృందాన్ని స్వాగతించి.. వారిని సురక్షితంగా హోటల్ కు తీసుకెళ్లారు. అయితే సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాక్ తీరును ప్రపంచ దేశాల ముందు ఎండగట్టడానికి ఏడు బృందాలు ప్రపంచ దేశాలు వెళ్తున్నాయి. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంపై తాము జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత్ మొత్తం ఏడు అఖిలపక్ష దౌత్య బృందాలను ఏర్పాటు చేసింది. పాకిస్తాన్ నేతృత్వంలోని తీవ్రవాదం, ఆపరేషన్ సిందూర్ పై వివిధ దేశాలకు ఆయా బృందాలు వివరించనున్నాయి.