TG Rajiv Yuva Vikasam: సర్కార్ కీలక నిర్ణయం.. 50వేల రుణానికి వంద శాతం రాయితీ.. మార్గదర్శకాలు ఇవే!

Telangana Rajiv Yuva Vikasam Scheme 2025: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు రాజీవ్ యువ వికాసం పథకంపై కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగానే ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి సంబంధించి మార్గ దర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం కింద జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ లబ్ధిదారులను జనాభా ప్రాతిపదికన ఖరారు చేయాలని నిర్ణయించింది. మున్సిపాలిటీలు, మండలాలలో సంక్షేమ వర్గాల జనాభా మేరకు కలెక్టర్లు యూనిట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపింది. దీంతో లబ్ధిదారుల ఎంపిక విషయంలో వస్తున్న రకరకాల ఊహాగానాలకు చెక్ పెట్టేసింది.
‘రాజీవ్ యువ వికాసం’ కోసం https://tgobmms.cgg.gov.in/లో స్వీకరిస్తోంది. వచ్చే నెల ఐదు వరకు వాటిని స్వీకరించనుంది. ఏప్రిల్ 6 నుంచి మే 20 వరకు దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. ఎంపికైన లబ్దిదారులకు తెలంగాణ ఆవిర్భావం రోజు జూన్ 2 నుంచి ప్రభుత్వం మంజూరు పత్రాలను అందజేయనుంది. 5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలని ప్రభు త్వ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఇందులో భాగంగానే ఈ స్కీంకు సంబంధించి యువతీ యువకుల అర్హతలు, వయో పరిమితి, ఆదాయ పరిమితి, యూనిట్లకు ఇచ్చే రాయితీలు, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం వంటి అంశాలపై మార్గదర్శకాలను జారీ చేసింది. రూ.50 వేలలోపు యూనిట్కు 100 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. మిగతా యూనిట్లకు కూడా 70 నుంచి 90 వరకు రాయితీ ప్రకటించింది. . 2 పికైనవారి వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాలలో రూ.2 లక్షలకు మించకూడ దు. ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. రేషన్ కార్డు వివరాలు కచ్చితంగా నమోదు చేయాలని పేర్కొంది.
రేషన్ కార్డు లేకుంటే ‘మీసేవ’ ద్వారా జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం ఉండాలి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలను పరిగణనలోకి తీసుకుంటారు. పాస్ పోర్టు సైజు ఫొటోను అప్లోడ్ చేయాలి. వాహనాలకు అయితే డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి. వ్యవసాయ అనుబంధ యూనిట్లకు పట్టాదారు పాసు పుస్తకం తప్పనిసరి. దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికెట్ సమర్పించాలి.
అలాగే వ్యవసాయేతర స్కీంకు 1 జులై 2025 నాటికి 21 నుంచి 55 ఏల్ల మధ్య వయసు ఉండాలి. వ్యవసాయ, దాని ఆధారిత పథకాలకు 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, బీసీ ఫెడరేషన్, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ ఫెడరేషన్ల సభ్యులు, ఈబీసీ వర్గాలవారు రాజీవ్ యువ వికాసం పథకాని కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే వారి వయసు 21 నుంచి 55 యేండ్ల మధ్య ఉండాలి. రాయితీ యూనిట్ విలువను బట్టి మారుతుంది. రాయితీపోగా మిగతా మొత్తాన్ని బ్యాంకు రుణం ద్వారా లబ్దిదారుడికి అందజేస్తారు. లబ్ధిదారుడి వాటా అనేది ఉండదు. యూనిట్ విలువ రూ.50 వేలలోపు ఉంటే ప్రభుత్వమే వంద శాతం రాయితీ ఇస్తుంది. రూ.50,001 నుంచి రూ .లక్ష వరకు 90 శాతం రాయితీ, రూ.1,00,001రూ.2 లక్షలకు 80 శాతం రాయితీ ఇవ్వనుంది. ఇక రూ.2 లక్షలపైన విలువ వాటికి 70 శాతం రాయితీ లభించనుంది.