TPCC : ఈటల రాజేందర్ బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారు.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్

TPCC Chief Mahesh Kumar Goud : బీఆర్ఎస్, బీజేపీ ఒప్పందాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిర్గతం చేశారంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ కిషన్రెడ్డిల లోపాయకారి ఒప్పందంతోనే బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారంటూ విమర్శలు చేశారు. ముందుగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ అధినాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీలో ఎవరికి ఎంత ప్యాకేజీ అందిందో బహిర్గతం చేయాలన్నారు. ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల తర్వాత మాజీ మంత్రి హరీశ్రావు, ఈటల రాజేందర్ సమావేశమయ్యారని, ఈ భేటీలో కేసీఆర్తో ఈటల ఫోన్లో మాట్లాడారంటూ పేర్కొన్నారు.
ట్రంప్కు భయపడే యుద్ధం ఆపేశారా?
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్పై యుద్ధానికి దిగిన భారత్ మధ్యలో యుద్ధాన్ని ఆపడానికి కారణం చెప్పాలని డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భయపడే యుద్ధాన్ని మధ్యలో ఆపేశారా? అంటూ నిలదీశారు. యుద్ధాన్ని మధ్యలో ఎందుకు ఆపారని ప్రశ్నించారు. ట్రంప్ జోక్యంపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నిలదీశారు. పాక్-భారత్ యుద్ధంలో దేశం సాధించింది ఏంటి? అని ప్రశ్నించారు. పోగొట్టుకుంది ఏంటో దేశ ప్రజలకు ఎందుకు చెప్పడం లేదన్నారు. యుద్ధం అంటే ఇందిరాగాంధీ గుర్తుకు వస్తారని తెలిపారు. కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ ఇందిర హయాంలో జరిగాయని, కానీ ఎప్పుడూ రాజకీయం చేయలేదని స్పష్టం చేశారు.