Bhatti Vikramarka : ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Deputy Chief Minister Bhatti Vikramarka : ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కారు కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయా వర్గాలకు చెందిన వారికి రాజకీయ అధికారం కల్పించేందుకు చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిర్వహించిన ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలోని అన్నిరకాల వనరులను వెనుకబడిన వర్గాలకు ఇవ్వాలనేది కాంగ్రెస్ లక్ష్యమని చెప్పారు.
వెనుకబడిన వర్గాలను దృష్టిలో పెట్టుకునే తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను రూపొందిస్తోందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే ప్రభుత్వం భూగరిష్ఠ పరిమితి చట్టం చేసిందన్నారు. భూమిలేని ఎస్సీ, ఎస్టీలకు భూములు పంపిణీ చేసిందని గుర్తుచేశారు. 6.70 లక్షల ఎకరాలను కాంగ్రెస్ సర్కారు పేదలకు పంపిణీ చేసిందన్నారు. పేదలకు పంచిన భూములను వారు దున్నుకోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. గిరిజనుల భూమికి సాగునీటి కోసం ‘ఇందిరా సౌర గిరిజల వికాసం’ పథకాన్ని ప్రారంభించామన్నారు. ఈ పథకం కోసం రూ.12,500 కోట్లు కేటాయించామన్నారు. 2013లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని భట్టి వివరించారు.