Indira Giri Jalavikasam: రాష్ట్రంలో కొత్త పథకం.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!

Indira Soura Giri Jala Vikasam Scheme Launched by CM Revanth Reddy: నాగర్ కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ మేరకు 23 మంది చెంచు గిరిజన రైతులకు సోలార్ పంపు సెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం గిరిజనులతో ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వ్యవసాయం కోసం సౌర విద్యుత్ ఏర్పాటు చేశామని చెప్పారు. అదనంగా వచ్చే సౌర విద్యుత్ ప్రభుత్వానికి ఇవ్వాలని సూచించారు. సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై గిరిజనులకు అవగాహన కల్పించారు. అచ్చంపేట మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయాలన్నారు. వంద రోజుల్లో కరెంట్ మోటర్ల స్థానంలో సోలార్ పంపు సెట్లు తీసుకురావాలన్నారు. గిరిజనులకు నెలకు రూ.3వేల నుంచి రూ.5 వేల ఆదాయం రావాలన్నారు.
రూ.12.600కోట్లతో ఈ పథకాన్ని చేపట్టారు. ఈ మేరకు ఈనెల 25 వరకు మండలాల వారీగా అర్హులైన ఎస్టీ రైతులను గుర్తించడంతో పాటు జూన్ 10 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.అలాగే భూగర్భ జలాల సర్వే తదితర పనులను గిరిజన సంక్షేమశాఖ చేపడుతుందన్నారు. అంతేకాకుండా జూన్ 25 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు భూముల అభివృద్ధి, బోరుబావుల తవ్వకం, సోలీర్ పంపుసెట్ల ఏర్పాటు వంటి పనులను పూర్తి చేయనున్నారు.
ఇదిలా ఉండగా, తొలి ఏడాదికి 10వేల మంది రైతులకు చెందిన 27,184 ఎకరాలను సాగులోకి తీసుకొచ్చేందుకు దాదాపు రూ.600 కోట్లు ఖర్చుచేయనున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణానికి పోడు పట్టాలు మంజూరైన సంగతి తెలిసిందే. అయితే ఇందులో విద్యుత్ సౌకర్యం లేనటువంటి 6 లక్షల ఎకరాలకు ఈ కొత్త పథకం వర్తంపజేయనున్నారు. ఇక, ఒక్క గిరిజన రైతుకు 2.5 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్ యూనిట్.. అంతకంటే తక్కువగా ఉన్న రైతులను ఓ గ్రూపుగా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా సోలార్ ద్వారా మహిళలకు అదనంగా అదనపు ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.