Published On:

CM Revanth Reddy : బీఆర్ఎస్ కాదు.. అది డీఆర్ఎస్.. డీఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్యసమితి : సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy :  బీఆర్ఎస్ కాదు.. అది డీఆర్ఎస్.. డీఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్యసమితి : సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తుర్కపల్లి మండలంలో 66 వేల ఆయకట్టు లక్ష్యంగా నిర్మించబోతున్న గంధమల్ల రిజర్వాయర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్, యాదగిరిగుట్ట మెడికల్ కళాశాల, వేద పాఠశాల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. కొలనుపాక-కాల్వపల్లి హైలెవెల్ వంతెన, మోటకొండూరులో ఎంపీపీ, మండల కార్యాలయం, పోలీస్ స్టేషన్ భవనాలకు శంకుస్థాపన చేశారు.

 

ఆలేరు నియోజకవర్గంలో రూ.1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు సోలార్ యూనిట్లు వంటి పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు వాటి పత్రాలు అందజేశారు. అనంతరం తుర్కపల్లిలోని తిర్మలాపూర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.

 

లక్ష్మీనర్సింహాస్వామి ఆశీస్సులతోనే అధికారం..
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహాస్వామి ఆశీస్సులతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్ట పేరు మార్చారని, యాదగిరిగుట్టను యాదాద్రి చేశారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తామని గుర్తుచేశారు. భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆలయంలో పనులు చేపట్టామని చెప్పారు. గత పదేళ్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని బీఆర్ఎస్‌ను ప్రశ్నించారు. ఇటీవల తన పుట్టిన రోజు సంబురాలు చేసుకోకుండా మూసీ ప్రాంత ప్రజల కష్టాలు చూసేందుకు వచ్చినట్లు తెలిపారు. వారి కష్టాలు చూసి చలించిపోయినట్లు చెప్పారు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని మాటి ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం పనులు ప్రారంభించామన్నారు.

 

బీఆర్ఎస్ కాదు.. అది డీఆర్ఎస్.. డీఆర్ఎస్
గుజరాత్‌లో సబర్మతి, ఉత్తరప్రదేశ్‌లో యమునా నదిని అభివృద్ధి చేసుకున్నారని, తాము మూసీని అభివృద్ధి చేస్తామని చెప్పగానే, ప్రతిపక్షాలు ఏడ్చి గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణను అభివృద్ధి చేసుకోవద్దా? తాము ఎన్నాళ్లు మూసీ మురికిలో ఉండాలని అడిగారన్నారు. నల్లగొండ జిల్లా ప్రజల బాధలు బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నేతలకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాదు.. అది డీఆర్ఎస్.. డీఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్యసమితి అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అలాంటి దయ్యాలను పొలిమేరల వరకు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా ప్రజల సహకారం కావాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అందరూ కాంగ్రెస్ నేతలను 50 వేల పైచిలుకు మెజార్టీతో గెలిపించారని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు.

 

ఒకటో తేదీన జీతాలు..
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని చెప్పారు. గతంలో మొదటి తారీఖున జీతాలు వచ్చినట్లు నిర్ధారిస్తే వచ్చే ఎన్నికల్లో తమకు ఓటు వేయొద్దని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని విస్మరించి, రాష్ట్రన్ని బొందలగడ్డ నుంచి ప్రతీ వెధవ ఇప్పుడు తమకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. యాదగిరిగుట్టలో అపచారం వల్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకున్నదన్నారు. చేసిన పాపాల వల్ల కిందపడి మక్కెలు విరిగాయని కేసీఆర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాసాలమర్రిని ఆగమాగం చేశారని, గ్రామాన్ని సరిచేసే బాధ్యత తాము తీసుకుంటామని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి: