Hyderabad Fire Accident: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై పూర్తి వివరణ

Hyderabad Fire Accident: హైదరాబాద్లోని పాతబస్తీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. భవనంలో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 6 గంటల సమయంలో గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో అకస్మాత్తుగా మంటలతో పాటు దట్టంగా పొగ అలుముకుంది. దీంతో ఆ భవనం మొదటి అంతస్తులో నివాసముంటున్న నగల వ్యాపారి కుటుంబం, వారింటికి వచ్చిన బంధువులు ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయారు. మొదటి అంతస్తులో 17 మంది ఉండగా..వారందరినీ ఉస్మానియా, యశోద, డీఆర్డీవో, అపోలో ఆస్పత్రులకు తరలించారు. అయితే కొందరు ఘటనాస్థలంలోనే మృత్యువాత పడగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు.
ఘటనాస్థలంలో సహాయక చర్యలకు అగ్నిమాపక సిబ్బంది, ఇతర అత్యవసర సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాయి. ఇంట్లోకి పొగ చేరడం.. ఒకే మెట్ల మార్గం ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. నిచ్చెనలతో మొదటి అంతస్తులోకి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది..ఇంట్లోకి చేరే మార్గం లేక తలుపులు పగులగొట్టి స్పృహ తప్పి ఉన్న పలువురిని బయటకు తీసుకొచ్చారు. అగ్నిమాపక, డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. 10 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
షార్ట్ సర్క్యూట్ వల్లే గుల్జార్హౌస్లో అగ్నిప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. ఇంటిలో చెక్కతో చేసిన ప్యానెళ్ల వల్లే మంటలు వ్యాపించాయన్నారు. విద్యుదాఘాతంతో చెక్క మొత్తం కాలి మంటలు వచ్చాయని చెప్పారు. భవనంలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన మెయిన్ వద్ద నిత్యం విద్యుదాఘాతం జరుగుతోందని కార్మికులు చెప్పారన్నారు. అగ్నిప్రమాద నివారణకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని నాగిరెడ్డి తెలిపారు.
ఉస్మానియా ఆస్పత్రి వద్ద GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పై మృతుల బంధువులు తిరగబడ్డారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన GHMC మేయర్, ఎంపీ అనిల్ కుమార్పై మృతువుల బంధువులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంబులెన్స్ సమయానికి వస్తే తమ కుటుంబ సభ్యులు బ్రతికేవారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబులెన్సులో కనీసం ఆక్సిజన్ మాస్క్ లేదన్నారు. తాము రేవంత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించిన పాపానికి బుద్ది వచ్చిందని వాపోయారు.
అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృత్యువాత పడిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబసభ్యులతో రేవంత్ ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి పొన్నం.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.
గుల్జార్హౌస్ వద్ద ఘటనాస్థలాన్ని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పరిశీలించారు. సహాయక చర్యల్లో అగ్నిమాపక సిబ్బంది ఆలస్యం చేశారని.. చిన్న ప్రమాదమే అయినా, ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందన్నారు. అగ్నిమాపక సిబ్బందికి ప్రభుత్వం సరైన పరికరాలు, శిక్షణ అందించాల్సి ఉందన్నారు. అగ్నిమాపక శాఖ సాంకేతికతను మెరుగుపరుచుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు కేంద్రం తరఫున సాయం అందిస్తామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
గుల్జార్హౌస్ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీతో పాటు మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్రావు, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇస్తామన్న ప్రధాని మోదీ.. మృతులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం మృతులకు 5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
హైదరాబాద్లో గుల్జార్ హౌస్ ప్రమాద ఘటన మరో సారి భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. నగరంలో వరుసగా అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతున్నా.. జీహెచ్ఎంసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ జనసంచారం ఉంటే అపార్ట్మెంట్లు, వ్యాపార సముదాయాల వంటి భవనాల్లో యజమానులు, అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే ఇటువంటి సంఘటనలు వాటిల్లుతున్నాయని మండిపడుతున్నారు.