Jagga Reddy on PM Modi: మోదీకి, ఇందిరమ్మకి చాలా తేడా ఉంది.. ఆమె అలా చేయలేదు

Jaggareddy Comments on PM Modi during India Pakistan War: భారత్- పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయి. అయితే ఉత్తర, పశ్చిమ భారత్ మాత్రం ఇంకా ఆందోళన పరిస్థితులు నెలకొనే ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. అందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ మన దేశంపై దాడులు చేసింది. వాటిని భారత రక్షణ వ్యవస్థ ఎదుర్కోవడంతోపాటు పాకిస్తాన్ పై కూడా దాడులు చేసింది. అయితే ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ అమలవుతోంది. అయితే ఇవాళ జరిగిన డీజీఎంఓ మీటింగ్ లో భవిష్యత్తు కార్యచరణపై ఇరుదేశాలు చర్చించాయి. దీంతో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అయితే భారత్- పాక్ దాడులపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం జరిగిన యుద్ధం కంటే.. ఇందిరాగాంధీ హయాంలో ఇరుదేశాల మధ్య జరిగిన యుద్ధం గురించే ప్రజలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని అన్నారు. 1971లో భయంకరమైన యుద్ధం జరిగిందని అప్పుడు ప్రధాని ఇందిరమ్మ తీసుకున్న నిర్ణయాలను యావత్ ప్రపంచం మెచ్చుకుందన్నారు. ప్రతిపక్షాలతో కూడా విమర్శలు లేకుండా చేశారని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ సేవలకు మెచ్చుకుని మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్ పేయి ఆమెను అపర కాళీ అని ప్రశంసించారని గుర్తుచేశారు. కులం, మత భేదం లేకుండా అందరూ ఆమెను అభినందించారని చెప్పుకొచ్చారు.
కాగా గతంలో జరిగిన యుద్ధంలోనూ అమెరికా యుద్ధాన్ని ఆపాలని చూసిందని.. కానీ ఇందిరా గాంధీ ఊరుకోలేదని చెప్పారు. భారతదేశ ప్రజల నిర్ణయంలో తలదూర్చొద్దని బహిరంగంగా చెప్పారని పేర్కొన్నారు. చివరకు పాకిస్తాన్ తలవంచి ఓటమిని ఒప్పుకుందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత ప్రధాని మోదీ అందుకు భిన్నంగా వ్యవహరించారని అన్నారు. అమెరికా చెప్తే ఆయన కాల్పుల విరమణకు ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు.