Published On:

CM Revanth Reddy at NITI Aayog: హైదరాబాద్ మెట్రోకు త్వరగా అనుమతులు ఇవ్వండి.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి

CM Revanth Reddy at NITI Aayog: హైదరాబాద్ మెట్రోకు త్వరగా అనుమతులు ఇవ్వండి.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి

CM Revanth Reddy spoke to PM Modi about Metro Rail: కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ మూడు జోన్లుగా తెలంగాణకు విభజించి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 2047 నాటికి పరిశ్రమలు, ఇన్‌ఫ్రా రంగంలో అంతర్జాతీయ నగరాల సరసన తెలంగాణను నిలబెడతామన్నారు. తెలంగాణ రైజింగ్​-2047 విజన్‌తో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఏడాదిన్నర కాలంలో అమెరికా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, దావోస్‌లో పర్యటించి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించామని వెల్లడించారు. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్​ సమావేశంలో సీఎం రేవంత్‌ తెలంగాణపై తన కార్యచరణను వివరించారు.

 

తెలంగాణ రైజింగ్ విజన్..

తెలంగాణ మొత్తాన్ని 3 జోన్లుగా విభజించి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో రైలు రెండో దశ, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మాన్యూఫాక్చరింగ్ హబ్, అగ్రిబేస్డ్ ప‌రిశ్రమలు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. సబర్మతీ రివర్ ఫ్రంట్, గంగా పునరుద్ధరణ ప్రాజెక్టు మాదిరిగా రాష్ట్రంలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉందని తెలిపారు. మెట్రో రెండో దశ, రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టులు ప్రస్తుతం డీపీఆర్‌ల దశలో ఉన్నాయన్నారు. రేడియల్ రోడ్ల నిర్మాణం, ప్రతిపాదిత డ్రై పోర్టు నుంచి మచిలీపట్నం పోర్టుకు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం.. తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా మారనుందన్నారు. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా డెవలప్‌మెంట్, పారదర్శక సుపరిపాలన తెలంగాణ రైజింగ్ విజన్‌లోని నాలుగు కీలక అంశాలు అని స్పష్టం చేశారు.

 

సూపర్ పవర్‌గా ఇండియా..

పాక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టినందుకు ఇండియా సైన్యం, ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. 1971లో ఇందిరాగాంధీ నాయకత్వంలో పాక్‌ను ఓడించి, దేశాన్ని రెండు ముక్కలుగా చీల్చిన చరిత్రను గుర్తుచేశారు. 2047 నాటికి భారత్‌ను నంబర్ వన్‌గా నిలబెట్టాలన్న మోదీ సంకల్పాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. అదే స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఆర్థిక, సామాజిక, తదితర రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్​ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని చెప్పారు.

 

జూన్ 2 నుంచి యువతకు రూ.5లక్షలు..

తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల గణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు ప్రజాప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. దేశవ్యాప్త కుల గణనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం రేవంత్ స్వాగతించారు. 2028 నాటికి తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు రూ.5 లక్షల స్వయం ఉపాధి పథకాన్ని జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభిస్తామన్నారు.

 

కేంద్రం మద్దతు కావాలి..

వికసిత్ భారత్‌ లక్ష్య సాధన మనందరి ఆశయమన్నారు. అందులో తెలంగాణ కీలక పాత్ర పోషించాలనేదే తమ ఆకాంక్ష అన్నారు. నేషన్ ఫస్ట్–పీపుల్ ఫస్ట్.. అన్న ప్రాధాన్యతతో ముందుకెళ్తామన్నారు. కేంద్రం సహాయం, సహకారం లేకుండా తెలంగాణ రైజింగ్ విజన్ అమలు చేయలేమన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.

 

ఇవి కూడా చదవండి: