Published On:

Kedarnath: తెరుచుకున్న కేదార్ నాథ్ టెంపుల్.. భారీగా భక్తుల రాక

Kedarnath: తెరుచుకున్న కేదార్ నాథ్ టెంపుల్.. భారీగా భక్తుల రాక

Temple: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రం కేదార్ నాథ్ ఆలయ ద్వారాలను అధికారులు నేడు తెరిచారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్ నాథ్ ఆలయంలో ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబా కేదార్ పంచముఖ విగ్రహాన్ని తీసుకువచ్చారు. అనంతరం భక్తుల భజనలు, హర హర మహాదేవ్ నినాదాలతో ప్రాంగణమంతా మార్మోగిపోయింది. ఆలయ ద్వారాలు తెరిచిన సందర్భంగా పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా కేదారేశ్వరుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

అయితే కేదార్ నాథ్ ఆలయ ద్వారాలను ప్రతియేట వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ పంచమి రోజున తెరవడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఇవాళ ఉదయం 7 గంటలకే టెంపుల్ ను ఓపెన్ చేశారు. ఆలయాన్ని రాబోయే 6 నెలలపాటు తెరిచి ఉంచుతారు. కేదార్ నాథ్ ఆలయంలో ఈ ఏడాది నుంచి స్వామిని దర్శించుకునేందుకు కొత్తగా టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. గంటకు 1400 మంది దర్శనం చేసుకొనే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. టోకెన్లను సంగం వద్ద ఉన్న 10 కౌంటర్లలో జారీ చేస్తున్నారు. టోకెన్లో పేర్కొన్న టైం స్లాట్ ప్రకారం భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తారు. భక్తులు త్వరగా స్వామివారి దర్శనాన్ని చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

కాగా బాబా కేదార్ నాథ్ విగ్రహాన్ని ఆలయం ముసివేసిన తర్వాత రుద్రప్రయాగ జిల్లాలోని ఉఖిమత్ లోని ఓంకారేశ్వర్ ఆలయానికి తరలిస్తారు. శీతాకాలంలో ఆలయం మూసివేసి ఉండటంతో భక్తులు ఈ ఆలయంలోని బాబా కేదార్ నాథ్ ను దర్శించుకుంటారు.