YS Sharmila : అమరావతి మహిళలపై సజ్జల మూర్ఖుడిలా మాట్లాడారు : వైఎస్ షర్మిల
AP PCC President YS Sharmila : వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అమరావతి మహిళలపై సజ్జల చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. మంగళవారం అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలను కించపరుస్తూ సజ్జల ఒక మూర్ఖుడిలా మాట్లాడారని ఫైర్ అయ్యారు. వైసీపీ చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తోందని తెలిపారు. సజ్జల కుమారుడు భార్గవ్రెడ్డి సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని తనపై కూడా దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. వైఎస్ కుమార్తె, ఒక మహిళ అని కూడా చూడకుండా కించపరిచారని తెలిపారు. జగన్ అందరినీ తన అక్కాచెల్లెళ్లు అంటారని, కానీ, ఆయన సొంత చెల్లికే మర్యాద లేదన్నారు. రాష్ట్రంలోని మహిళలను ఏం గౌరవిస్తారని విమర్శించారు.
పార్టీలో కొందరి తీరుపై షర్మిల అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మహా సముద్రమని, పార్టీలో మంచితోపాటు చెత్త కూడా ఉంటుందన్నారు. పార్టీ అభివృద్ధి చెందుతుంటే కిందకి లాగేవాళ్లు ఉన్నారని తెలిపారు. వారే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఉందని పేర్కొన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సొంత పార్టీపై దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు.