AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. కీలక నిందితుడు అరెస్టు
AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో మైసూరులో అతడిని అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. గోవిందప్ప భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరక్టర్గా ఉన్నారు.
సిట్ అధికారులు నోటీసులు..
లిక్కర్ స్కార్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ గోవిందప్పతోపాటు సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డికి మూడు రోజుల కింద సిట్ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. ముగ్గురిని విజయవాడ కమిషనరేట్లోని సిట్ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ముగ్గురు నోటీసులను బేఖాతరు చేస్తూ విచారణకు గైర్హాజరయ్యారు. ఇప్పటికే వీరు ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు సైతం అరెస్టు నుంచి వీరికి మధ్యంతర రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది.
డిస్టిలరీల నుంచి ముడుపులు ..
వైఎస్ జగన్కు గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి అత్యంత సన్నిహితులు. లిక్కర్ సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడం, ఆ డబ్బును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో కృష్ణమోహన్రెడ్డి, గోవిందప్పతోపాటు ధనుంజయరెడ్డి పాత్ర ఉంది. ముడుపులుగా ఎంత మొత్తం చెల్లించాలనే దానిపై ముగ్గురు తరచూ హైదరాబాద్, తాడేపల్లిలో లిక్కర్ సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో సమావేశమయ్యేవారని సిట్ ఇప్పటికే తేల్చింది. లిక్కర్ ముడుపుల సొమ్మును రాజ్ కెసిరెడ్డి వీరికి చేవవేస్తే, వీరు దాన్ని వైఎస్ జగన్కు అందజేసేవారని ఇప్పటివరకు అరెస్టు అయిన నిందితులకు సంబంధించిన రిమాండ్ రిపోర్టుల్లో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో మైసూరులో బాలాజీ గోవిందప్పను సిట్ అరెస్టు చేసింది.