Donald Trump on Samsung: యాపిల్ తరహాలోనే శాంసంగ్నూ టార్గెట్ చేసిన డొనాల్డ్ ట్రంప్!

US President Donald Trump Warns to Samsung: ప్రముఖ ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. యూఎస్లోనే ఫోన్లను తయారు చేయాలని సూచించారు. లేకపోతే 25శాతం సుంకాన్ని విధిస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు. మరో దిగ్గజ మొబైల్ ఉత్పత్తుల సంస్థకు ట్రంప్ ఇదే తరహాలోనే హెచ్చరికలు చేశారు.
యాపిక్ ప్రత్యర్థి, దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ మొబైల్ సంస్థ శాంసంగ్ తమ ఉత్పత్తులను అమెరికాలోనే తయారు చేయాలని స్పష్టం చేశారు. లేకపోతే 25 శాతం దిగుమతి సుంకాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైట్హౌస్లో విలేకరులతో ట్రంప్ మాట్లాడారు. అగ్రరాజ్యంలో పరికరాలను విక్రయించే ఏ మొబైల్ తయారీ సంస్థకైనా టారిఫ్ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఏ సంస్థ అయినా అమెరికాలోనే తయారు చేయాలి..
ఏ సంస్థ అయినా తమ ఉత్పత్తులను అమెరికాలోనే తయారు చేయాలన్నారు. ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసినవి తీసుకొస్తే అన్యాయమని చెప్పారు. అగ్రరాజ్యంలో పరికరాలను విక్రయించే ఏ మొబైల్ తయారీ సంస్థ అయినా యూఎస్లో ప్లాంట్ నిర్మిస్తే ఎలాంటి టారిఫ్లు ఉండవని స్పష్టం చేశారు. లేకపోతే 25 శాతం దిగుమతి సుంకాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు.
శాంసంగ్ అమెరికా మార్కెట్లో నంబరు-2
దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ మొబైల్ సంస్థ శాంసంగ్ యూఎస్ మార్కెట్లో నంబరు-2 విక్రేతగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 220 మిలియన్ ఫోన్లను విక్రయిస్తుంది. 60 శాతం మొబైల్స్ను వియత్నాంలో ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఎక్కువగా అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. మరోవైపు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం 2024లో ఇండియాలో తయారు చేసిన మొత్తం స్మార్ట్ఫోన్లలో యాపిల్, శాంసంగ్ 94 శాతం వాటా కలిగి ఉన్నాయి. 2025 మార్చి త్రైమాసికంలో ఇండియాలో శాంసంగ్ మార్కెట్ వాటా 17 శాతంగా ఉంది.