Tirumala: భక్తులతో మారుమోగుతున్న తిరుమల.. శిలాతోరణం వరకు క్యూలైన్లు
Devotees Rush: గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మారుమోగిపోతున్నాయి. వేసవి సెలవులు పూర్తికావొస్తున్న నేపథ్యంలో, వరుస సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో భక్తులతో తిరుమల గిరులు కిక్కిరిశాయి. మరోవైపు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో కూడా కాలినడకన భక్తులు పెద్దఎత్తున్న కొండకు చేరుకుంటున్నారు.
దీంతో శ్రీవారి సర్వదర్శనానికి వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయి వెలుపల శిలాతోరణం వరకు 2 కి.మీ. మేర క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామివారి దర్శనానికి 24 గంటలకుపైగా సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ దర్శనానికి 6 గంటలు, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు పాలు, మంచినీరు, అన్నప్రసాదం పంపిణీ చేస్తోంది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక నిన్న స్వామివారిని 72,174 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 35,192 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.88 కోట్లు వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది.