Published On:

Govindaraja Swamy: సూర్యప్రభ వాహనంపై గోవిందరాజ స్వామి.. వైభవంగా బ్రహ్మోత్సవాలు

Govindaraja Swamy: సూర్యప్రభ వాహనంపై గోవిందరాజ స్వామి.. వైభవంగా బ్రహ్మోత్సవాలు

Tirupati: తిరుపతి శ్రీగోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఏడోరోజు ఆదివారం ఉదయం స్వామివారి సూర్యప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు. పురాణాల ప్రకారం ఆదివారం సూర్యదేవుడిని ఆరాదిస్తుంటారు. అలాగే సూర్యదేవునికి ఏడు సంఖ్య ఎంతో ప్రీతి అని వేద పండితులు చెప్తుంటారు. అలాంటిది ఆదివారం, బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు సూర్యప్రభ వాహనంపై స్వామివారు విహరించడంతో భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తజనులు చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాలతో భక్తిని చాటుకున్నారు.

 

అలాగే పురవీధుల్లో భక్తులు స్వామివారికి కర్పూర హారతులు, పూలు, పండ్లు, ఫలహారాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వాహనసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతంగా శీగోవిందరాజస్వామివారికి ఆలయంలో స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరినీరు, పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. ఇక రాత్రి 7.30 గంటలకు స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.