Tenth Exams : ఏపీలో రేపటి నుంచి పది పరీక్షలు

Tenth Exams : ఏపీలో రేపటి (సోమవారం) నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 17న ప్రారంభమై వచ్చే నెల 1వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించనున్నారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం 6,49,275 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎండల తీవ్రత పెరిగిపోవడంతో పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ టెన్త్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. పరీక్షలు రాయనున్న విద్యార్థులకు మంత్రి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. అందరూ చక్కగా పరీక్షలు రాయాలని, మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఆందోళన పడొద్దు. ఎటువంటి ఒత్తిడికి లోనుకావొద్దు. హాల్టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లండి. ఇన్నాళ్లు మీరు చదివిన కష్టం ఫలితాల రూపంలో వచ్చే సమయం ఇది. ప్రశాంతంగా ఉండండి. సకాలంలో పరీక్ష పూర్తి చేయండి. విజయీభవ’ అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.