IND vs PAK: సత్తా చాటిన కుల్దీప్, హార్ధిక్.. పాక్ ఆల్ అవుట్.. టార్గెట్ ఎంతంటే..?

IND vs PAK: భారత్-పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతోంది. పాక్ భారత్కు 242 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. 43వ ఓవర్లో సల్మాన్ అఘా (19), షాహీన్ అఫ్రిది (0)లను కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. రవీంద్ర జడేజా 37వ ఓవర్లో తయ్యబ్ తాహిర్ (1)ను అవుట్ చేశాడు. 35వ ఓవర్లో సౌద్ షకీల్ (62)ను హార్దిక్ పాండ్యా పెవిలియన్ కు పంపాడు. 34వ ఓవర్లో మహ్మద్ రిజ్వాన్ (46)ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. పదో ఓవర్లో ఇమామ్ ఉల్ హక్ (10) రనౌట్ అయ్యాడు. తొమ్మిదో ఓవర్లో బాబర్ ఆజం (23)ను హార్దిక్ అవుట్ చేశాడు.
ప్లేయింగ్ ఎలెవన్లో పాకిస్థాన్ ఒక మార్పు చేసింది. ఫఖర్ జమాన్ స్థానంలో ఇమామ్-ఉల్-హక్ని తీసుకొచ్చింది. గాయం కారణంగా ఫఖర్ టోర్నీకి దూరమయ్యాడు. భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు విజయాలతో ఉత్సాహంగా ఉంది. భారత్ తన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది.
భారత్ టీమ్ ఈ ఆదివారం వరుసగా రెండో విజయాన్ని సాధించి , సెమీ-ఫైనల్లోకి ప్రవేశించాలని బలంగా ప్రయత్నిస్తోంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన ఓటమిని సమం చేయాలని భారత్ కూడా కసరత్తు చేస్తోంది. అదే సమయంలో, రిజ్వాన్ నేతృత్వంలోని జట్టు మొదటి మ్యాచ్లో న్యూజిలాండ్తో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆతిథ్య పాకిస్థాన్కు ఇది ‘డూ ఆర్ డై’ మ్యాచ్. ఒకవేళ భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోతే, టోర్నీలో ముందున్న మార్గం చాలా కష్టంగా మారుతుంది.