UNO : రెండు దేశాలు సంయమనం పాటించాలి : భారత్, పాక్లకు ఐక్యరాజ్యసమితి సూచన

United Nations : జమ్ముకాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని భారత్ సహా యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. ఐక్యరాజ్యసమితి దాడిని హేయమైనదిగా అభివర్ణించింది. జమ్ముకశ్మీర్లో ఆందోళనకర పరిస్థితిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నిశితంగా పరిశీలిస్తున్నారని ఐరాస అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. ఉగ్రదాడిని ఐరాస తీవ్రంగా ఖండిస్తోందన్న ఆయన ప్రస్తుతం రెండుదేశాలు సంయమనం పాటించాలని సూచించారు.
దాడి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు..
జమ్ముకశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండిస్తోంది. పౌరులపై దాడి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. గుటెర్రస్ ఆందోళనకర పరిస్థితిని నిశితింగా పరిశీలిస్తున్నారు. భారత్-పాక్ రెండు దేశాలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. ఇరుదేశాల మధ్య ఏదైనా సమస్య ఉంటే శాంతియుత చర్చలతో పరిష్కరించుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా సింధూ నదీ జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసింది. ఒప్పందపై మీడియా ప్రశ్నించింది. ఉద్రిక్తతల వేళ భారత్, పాక్ సంయమనం పాటించి, పరిస్థితులు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నామని చెప్పారు.
ఈ నెల 22న జమ్ముకాశ్మీర్లోని పహల్గాంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మరికొందరు ప్రాణాలతో బయట పడ్డారు.