Saif Ali Khan: హైకోర్టులో సైఫ్ అలీఖాన్కు చుక్కెదురు.. రూ.15 వేల కోట్ల ప్రాపర్టీ ప్రభుత్వానివే..

Saif Ali Khan faces a Challenge in the High Court: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్కు మధ్యప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. మధ్యప్రదేశ్లోని తన పూర్వీకుల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా పేర్కొనాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సైఫ్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. ఆయన కుటుంబానికి చెందిన రూ.15 వేల కోట్ల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా నిర్ణయిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై మరోసారి విచారణ జరపాలని, ఏడాదిలోపు తుది నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. తాజా పరిణామంతో ఆస్తుల యాజమాన్య హక్కులపై సందిగ్ధం నెలకొంది.
భోపాల్లో సైఫ్ అలీఖాన్ కుటుంబానికి అతడి నాన్నమ్మ సాజిదా సుల్తాన్ నుంచి పలు విలాసవంతమైన భవనాలు వారసత్వంగా వచ్చాయి. భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్ కుమార్తె సాజిదా. ఆయన పెద్ద కుమార్తె అబీదా సుల్తాన్ దేశ విభజన నేపథ్యంలో 1950లో పాక్కు వలస వెళ్లారు. సాజిదా ఇక్కడే నివసిస్తూ పటౌడీ నవాబు ఇఫ్తిఖర్ అలీఖాన్ (సైఫ్ తాత)ను పెళ్లి చేసుకున్నారు. సాజిదాకు ఆమె తండ్రి నుంచి వారసత్వంగా ఆస్తులు వచ్చాయి. వచ్చిన ఆస్తులు కాలక్రమేణా ఆమె వారసులు సైఫ్ కుటుంబానికి దక్కాయి.
హమీదుల్లాకు చట్టబద్ధ వారసురాలు అబీదా మాత్రమే అని, ఆమె పాకిస్థాన్కు వలస వెళ్లినందువల్ల ఎనిమీ యాక్ట్ ప్రకారం ఆస్తులను కాందిశీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం 2015లో ప్రకటించింది. దీనిని సవాల్ చేస్తూ సైఫ్ అలీఖాన్ కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు.