Shubhanshu Shukla: ఈ నెల 19న శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర.. ప్రకటించిన ఇస్రో!

Space X Dragon Spacecraft Launch on June 19 said by ISRO: సాంకేతిక సమస్యతో వాయిదా పడిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగానికి సంబంధించి కొత్త తేదీని ఇస్రో ప్రకటించింది. ఈ నెల 19న ప్రయోగం చేపట్టనున్నట్లు వెల్లడించింది. అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ కేంద్రం నుంచి ప్రయోగం జరగనుంది. ప్రయోగం ద్వారా ఇండియా, పోలండ్, హంగేరీకి చెందిన నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతున్నారు. మిషన్కు భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా పైలట్గా వ్యవహరించనున్నారు.
అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ ‘యాక్సియమ్’ చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘ఏఎక్స్-4’ మిషన్లో భాగంగా స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. ప్రైవేట్ రోదసి యాత్ర ద్వారా ఐఎస్ఎస్కు వెళ్లిన మొదటి భారత వ్యోమగామిగా శుభాన్షు చరిత్రలో నిలువనున్నారు. రాకేశ్ శర్మ 1984లో రోదసి యాత్ర చేశారు. నాలుగు దశాబ్దాల తర్వాత శుభాన్షు ఈ గౌరవాన్ని దక్కించుకోబోతున్నారు. నాసా సహకారంతో శుభాన్షు శుక్లా ఐఎస్ఎస్లో శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు.
నిజానికి మే 29వ తేదీన ప్రయోగం జరగాల్సి ఉండగా, వాయిదా పడింది. మొదట ప్రయోగాన్ని ఈ నెల 8కి వాయిదా వేశారు. తర్వాత ఈ నెల 10, 11కు వాయిదా పడింది. యాక్సియం-4 మిషన్కు సంబంధించిన ఫాల్కన్-9 రాకెట్ తనిఖీల్లో ద్రవరూప ఆక్సిజన్ లీకేజీ అయింది. దీంతో ఈ నెల 11వ తేదీన జరగాల్సిన ప్రయోగం వాయిదా పడింది. లీకేజ్కు సంబంధించిన మరమ్మతులు పూర్తిచేసేందుకు మరింత సమయం పడుతుందని, రాకెట్ లాంచింగ్ను వాయిదా వేస్తున్నట్లు స్పేస్ఎక్స్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త తేదీని ప్రకటించింది.