Char Dham Yatra : చార్ధామ్ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు.. 16 లక్షల మంది దర్శనం

6.50 lakh devotees visited the Kedarnath temple : చార్ధామ్ యాత్రకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైంది. ఏప్రిల్ 30 నుంచి ఇప్పటి వరకు 16 లక్షల మంది భక్తులు గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను దర్శించుకున్నారు. 30 రోజుల్లో కేదార్నాథ్ ఆలయాన్ని 6.50లక్షల మందికిపైగా భక్తులు సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు.
12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం ఒకటి. చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ ఆలయం సందర్శన భాగంగా ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్నాథ్కు వచ్చి పరమేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఆలయాన్ని మూసివేస్తారు. శీతాకాలంలో 6 నెలల పాటు ఆలయ తలుపులు మూసే ఉంటాయి. ఆ సమయంలో ఆలయం మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. తిరిగి వేసవిలో తలుపులు తిరిగి తెరుస్తారు.
ఈ ఏడాది చార్ధామ్ యాత్ర ఏప్రిల్ 30న ప్రారంభమైంది. గర్వాల్ హిమాలయాల్లోని గంగోత్రి, యమునోత్రి దేవాలయాలను అక్షయ తృతీయ సందర్భంగా తెరిచారు. తర్వాత కేదార్నాథ్ ఆలయాన్ని ఈ నెల 2న, బద్రీనాథ్ దేవాలయాన్ని ఈ నెల 4న తెరిచారు. శీతాకాలంలో నాలుగు ఆలయాలను మూసివేస్తారు (అక్టోబర్–నవంబర్ నెలల మధ్య). భక్తుల భద్రత కోసం యాత్ర మార్గాల్లో 6వేల మంది పోలీసులు, 17 కంపెనీల ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ సిబ్బంది, 10 కంపెనీల పారామిలిటరీ దళాలను మోహరించారు. 65కుపైగా ప్రాంతాల్లో రాష్ట్ర విపత్తు స్పందన దళ సిబ్బందిని మోహరించారు.