Accident: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం

Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ ఇవాళ తెల్లవారుజామున ఓ ప్యాసింజర్ ఆటోపై బోల్తా పడింది. ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఝాబువా జిల్లాలోని మేఘ్ నగర్ తహసీల్ పరిధిలోని సెంజెలి రైల్వే క్రాసింగ్ సమీపంలో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైలు ఓవర్ బ్రిడ్జి దాటుతుండగా లారీ అదుపుతప్పి పక్కనే వెళ్తున్న ఆటోపై పడింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. హటాహుటిన వచ్చిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ఝాబువా ఎస్పీ పద్మవిలోచన్ శుక్లా పరిశీలించారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతులంతా ఓ వివాహానికి హాజరై ఇవాళ తెల్లవారుజామున ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని గుర్తించారు. కాగా లారీ సిమెంట్ లోడ్ తో వెళ్తుండగా ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జు అయింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఒకే కుటుంబంలో 9 మంది చనిపోవడంతో కుటుంబంలో తీరని శోకసంద్రంగా మారింది.