TGPSC : గ్రూప్-1 నియామకాలపై టీజీపీఎస్సీ అప్పీలు దాఖలు.. రేపు హైకోర్టులో విచారణ

TGPSC : టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల పిటిషన్పై హైకోర్టులో అప్పీల్ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేసింది. పిటిషన్పై మంగళవారం హైకోర్టు సీజే ధర్మాసనం విచారించే అవకాశం ఉంది. గ్రూప్-1లో అక్రమాలు జరిగాయని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మెయిన్స్ మూల్యాంకనం సరిగ్గా జరగలేదని పిటిషనర్లు ఆరోపించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణ జరిపింది. విచారణ పూర్తయి తుది తీర్పు వెలువడే వరకు నియామక పత్రాలు జారీ చేయొద్దని ఆదేశాలు జారీచేసింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను కొనసాగించవచ్చని చెప్పింది.
563 పోస్టుల భర్తీకి పరీక్ష..
తెలంగాణలో మొత్తం 563 గ్రూప్-1 పోస్టులకు టీజీపీఎస్సీ జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ నిర్వహించింది. జూలై 7వ తేదీన ఫలితాలు విడుదల చేసింది. అనంతరం మెయిన్స్ పరీక్షలు చేపట్టింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. ఫలితాలను ప్రకటించి, సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టింది. మూల్యాంకనం విషయంలో కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గతవారం సింగిల్ బెంచ్ జడ్జి నియామకాలు చేపట్టొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా సింగిల్ బెంచ్ ఆదేశాలను టీజీపీఎస్పీ సవాల్ చేసింది.