Published On:

Banakacherla Project: రేపు బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక సమావేశం.. కేంద్ర మంత్రులు, ఎంపీలకు ఆహ్వానం!

Banakacherla Project: రేపు బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక సమావేశం.. కేంద్ర మంత్రులు, ఎంపీలకు ఆహ్వానం!

CM Revanth Reddy meeting on Banakacharla project: ఏపీలోని కూటమి సర్కారు అక్రమంగా పోలవరం ప్రాజెక్టు నుంచి చేపడుతున్న గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. ఈ నెల 18న బుధవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలోని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కార్యాలయంలో అన్నిపార్టీల ఎంపీలకు ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ఇవ్వనున్నారు. ముఖ్య అతిథిగా సీఎం పాల్గొననున్నారు. ఇప్పటికే అఖిలపక్ష ఎంపీలను అన్ని పార్టీల లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తోపాటు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు లేఖలు పంపడంతోపాటు ఫోన్ చేశారు. ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించిన గోదావరి–బంకచర్ల ప్రాజెక్టుపై ప్రదర్శన, చ‌ర్చించనున్నట్లు, అందులో పాల్గొని అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.

 

ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ, ఆర్థిక మంత్రిత్వ శాఖలకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సమర్పించిందని తెలిపారు. ప్రాథమిక అధ్యయనంలో ప్రాజెక్టు 1980 నాటి గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘించినట్లు కనిపిస్తోంద‌ని వెల్లడించారు. ఊహించిన విధంగా ప్రాజెక్టు తెలంగాణ ప్రజల నీటి హక్కులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు.

 

గోదావరి బన‌కచర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ సర్కారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంటూ తాను ఇప్పటికే కేంద్ర ఆర్థిక జలశక్తి మంత్రులకు కేంద్రానికి లేఖలు రాశానని వివరించారు. గోదావరి బంకచర్ల ప్రాజెక్టుపై తమ అభ్యంతరాలను తెలియజేశామని తెలిపారు. ప్రస్తుతం జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సీడబ్ల్యూసీ సమీక్ష సమావేశంలో ఉన్న గోదావరి–బన‌కచర్ల ప్రాజెక్టు ప్రీ-ఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించాలని కోరినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.

 

ఆయా అంశాలను దృష్టిలో పెట్టుకొని రేపు సాయంత్రం 4:00 గంటలకు అంబేద్కర్ సచివాలయంలో జరిగే సమావేశంలో ఎంపీల అభిప్రాయాలు, సూచనలను తీసుకోవాలని నిర్ణయించిట్లు తెలిపారు. సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. కేంద్ర మంత్రులు బండి సంజ‌య్, కిష‌న్‌రెడ్డిని గౌరవ అతిథిగా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.

 

ఇవి కూడా చదవండి: