TPCC Chief on Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ బాధ్యులకు శిక్ష పడాల్సిండే : పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Mahesh Kumar Goud Comments on Phone Tapping Case: గత బీఆర్ఎస్ సర్కారు తమ ఫోన్లను ట్యాప్ చేసినట్లు అనుమానం రావడంతోనే సీఎస్కు ఫిర్యాదు చేసినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు ఇవాళ ఆయన హాజరయ్యారు. కేసులో సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు..
టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు పొడుస్తూ తమ ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. చర్యకు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తలవంచుకోవాలన్నారు. రాజకీయాల్లో బీఆర్ఎస్ నేతలే ఉండాలనే దురుద్దేశంతో తమ ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఫోన్ల ట్యాపింగే కారణమన్నారు. రేవంత్రెడ్డితో పాటు తన ఫోన్ కూడా టాప్ చేసి తమ కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని తెలిపారు. ఇదే ఫిర్యాదును గతంలో చేశానని, ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చాయన్నారు. చట్టానికి వ్యతిరేకంగా అనేకమంది ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయని, సిట్ దర్యాప్తులో 650 మంది పేర్లు జాబితాలో ఉన్నాయని తెలిసిందని పేర్కొన్నారు.
కేటీఆర్ సిగ్గుతో తల దించుకోవాలి..
కుంభం అనిల్ కుమార్ యాదవ్, గాలి అనిల్తోపాటు అనేకమంది ఫోన్లు ట్యాప్ అయినట్లు బయటికి వచ్చిందన్నారు. ఇవన్నీ చూస్తే నాడు ఏ రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి దుశ్చర్యకు పాల్పడ్డారో అర్థమవుతోందన్నారు. ప్రజాస్వామ్యంలో బాగా పనిచేయాల్సిన అధికారులు రాజకీయ నేతలకు తలొగ్గి అడుగులకు మడుగులొత్తారని మండిపడ్డారు. ప్రైవసీ అనేది తమ ప్రాథమిక హక్కు అని దానిని కాలరాశారని ఫైర్ అయ్యారు. రిటైర్డ్ అయిన ప్రభాకర్రావును దేశచరిత్రలో ఎక్కడా లేనివిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా పెట్టి దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. నక్సలైట్లకు సానుభూతిపరులుగా ఉన్నారని మమ్మల్ని టాప్ చేయడం సిగ్గుచేటు అన్నారు. కేటీఆర్ సిగ్గుతో తల దించుకోవాలని డిమాండ్ చేశారు.
రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నం..
ఆనాడు తమ ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. దానికి మీరే శిక్షార్హులు అన్నారు. భవిష్యత్లో మరే ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా ఉండాలంటే వీరికి శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇలాంటి దిగజారుడు పనికి ఒడిగట్టిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు శిక్ష పడాలని కోరారు. సజావుగా విచారణ జరిపి, రాజకీయ నాయకులైనా, అధికారులైనా బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.