Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. మేడారం, భద్రాచలంకు త్వరలోనే మహర్ధశ

Nitin Gadkari Inaugurates Highway Roads In Telangana: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటించారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్లో ఆయన మాట్లాడారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. మేడారం, భద్రాచలం వరకు గ్రీన్ జాతీయ రహదారి కనెక్టివిటీ చేయనున్నట్లు తెలిపారు. భద్రాచలం, బాసర, మేడారం వంటి ఆధ్యాత్మిక దేవాలయాలను నేషనల్ హైవేతో కనెక్టివిటీ చేస్తామన్నారు. సూర్యాపేట టూ దేవరపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించనున్నామన్నారు.
ఇప్పటికే నాగ్పుర్ టూ విజయవాడ కారిడార్ చేపట్టినట్లు తెలిపారు. అలాగే తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రహదారి కనెక్టివిటీ మరింత పెరగనుందని చెప్పారు. దీంతో పాటు జగిత్యాల, కరీంనగర్ హైవే విస్తరణ పనులను త్వరలో పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. అంతకుముందు రూ.3,900కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను ప్రారంభించారు.
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి గడ్కరీ అన్నారు. వ్యవసాయం, ఉపాధి, రవాణా, మౌలిక సదుపాయాలు అనే నాలుగు అంశాలు అభివృద్ధిని నిర్దేశిస్తాయన్నారు. అందుకే ఈ 4 అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. ప్రజల ఆర్థిక స్థితిగతులు మారాలంటే విద్యతోనే సాధ్యమని వివరించారు.
ఆర్ఎస్ఎస్లో పనిచేసే సమయంలో ఆదివాసీలతో కలిసి పనిచేశామని అన్నారు. యువకులకు ఉద్యోగాలు, రైతులకు మద్దతు ధర దక్కాలన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం సీతక్క మాట్లాడారు. రాష్ట్రం, కేంద్రం కలిసి పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. రోడ్ల విషయంలో ఏ సమస్య చెప్పిన గడ్కరీ పరిష్కరిస్తారని కోమటి రెడ్డి అన్నారు.. రోడ్ల నిర్మాణంలో ఫారెస్ట్ క్లియరెన్సులు త్వరగా వచ్చేలా చూడాలన్నారు.
ఆదిలాబాద్ అనగానే వెనుకబడి అనే అపోహ ఉండేదని, కానీ జిల్లాలో ప్రస్తుతం రోడ్లను అభివృద్ధి చేశామని మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రాకముందు 2,500కి.మీ జాతీయ రాహదారులు ఉండేవని, కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 5,100కి.మీల జాతీయ రహదారులు నిర్మించామన్నారు.