Minister Ponnam: కీలక నిర్ణయం.. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ఓకే చెప్పిన కాంగ్రెస్ సర్కార్

Minister Ponnam Prabhakar Key Decision About RTC Employees: కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మే 5, మే 6వ తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా చర్చిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ సంస్థ కార్మికుల సంక్షేమంతో పాటు ప్రయాణికుల సౌకర్యం కోసం పనిచేయాలన్నారు. గత పదేళ్లుగా ఆర్టీసీ నిర్వర్యమైందని విమర్శలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ గాడిలో పడిందని, ఇప్పుడిప్పుడే లాభాలబాటలో పయనిస్తోందన్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కార్మికుల సహకరించాలని కోరారు. కాగా, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం హనుమకొండ జిల్లాలో పర్యటించారు.
ఇందులో భాగంగా. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎల్కతుర్తి మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ మేరకు ఎల్కతుర్తి బస్ స్టేషన్ వద్ద అంబేద్కర్ జంక్షన్ సుందరీకరణ పనులు పరిశీలించారు. ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
అలాగే, జంక్షన్ సుందరీకరణ పనుల్లో భాగంగా వాటర్ ఫౌంటెన్ ,లైటింగ్ పనులపై పలు సూచనలు చేశారు. అనంతరం ఎల్కతుర్తి బస్ స్టేషన్లో ఇటీవల ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను పరిశీలించి కార్యకర్తలు , అధికారులతో కలిసి అల్పాహారం చేశారు.
ఎల్కతుర్తిలో పెండింగ్ పనుల పై అధికారులతో ఆరా తీశారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తే వ్యాపారం ఆర్థిక వృద్ధి బాగుంటుందని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ మహిళలకు మంత్రి సూచించారు.