TGSRTC : తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వాయిదా.. జేఏసీ నేతలతో చర్చలు సఫలం

TGSRTC : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదాకు బ్రేక్ పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్తో జేఏసీ నేతలు చర్యలు జరిపారు. ఈ సందర్భంగా చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా పడింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ముగ్గురు ఐఏఎస్ అధికారులతో సర్కారు కమిటీని ఏర్పాటు చేసింది. నవీన్ మిట్టల్, లోకేశ్ కుమార్, కృష్ణభాస్కర్తో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యలకు పరిష్కారాలు సూచించనుంది. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్టీసీ డిపోల్లో ఏమి సమస్యలు ఉన్నాయి? ఉద్యోగులు, కార్మికుల పనిభారం, ఒత్తిళ్లు వంటి అంశాలకు పరిష్కారం ఏమిటనే అంశాలపై జేఏసీ నేతలతో మంత్రి పొన్నం చర్చించారు.
తాత్కాలిక వాయిదా మాత్రమే : జేఏసీ
మూడు గంటల పాటు చర్చలు కొనసాగాయి. చర్చల్లో ఆర్టీసీ విలీనం అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. చర్చల అనంతరం ఆర్టీసీ జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రైవేట్ విద్యుత్ బస్సుల గురించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. సర్కారే విద్యుత్ బస్సులు కొని ఆర్టీసీకి ఇచ్చేలా చర్యలు చేపడుతామని మంత్రి పొన్నం అన్నారు. కారుణ్య నియామకాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు.
సింగరేణి సంస్థలా రెగ్యులర్ ప్రాతిపదికన కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. విశ్రాంత ఉద్యోగుల బకాయిలు, వేతన సవరణ గురించి సానుకూలంగా స్పందించినట్లు జేఏసీ నేతలు పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చినట్లు తెలిపారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సమ్మెను కొంతకాలంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే మళ్లీ సమ్మె తేదీని ప్రకటిస్తామన్నారు. ఇది తాత్కాలిక వాయిదా మాత్రమేనని ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేయాలని టీజీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 6న అర్ధరాత్రి వరకు చర్చలకు ఆహ్వానం రాకపోతే 7 నుంచి సమ్మెకు దిగుతామని జేఏసీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం పెద్ద ఎత్తున కవాతు నిర్వహించారు. తాజాగా మంత్రి పొన్నంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.